కార్తీక మాసాన్ని ఎంతో పరమపవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ కార్తీకమాసం అంటే ఆ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో పవిత్రమైన పౌర్ణమి గా భావిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు ఉదయం స్నానమాచరించి పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలను సందర్శించి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.అయితే కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 వత్తులను వెలిగించడం ద్వారా ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి, కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఆవు నెయ్యి వేసి వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.అయితే కార్తీక పౌర్ణమి రోజు దీపాలను కొందరు శివాలయంలో వెలిగిస్తారు.
స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసంతో సాయంత్రం దీపాలను ఆవు నెయ్యి తో వెలిగించి నదిలో వదిలి, ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటారు.తరువాత చంద్ర దర్శనం చేసుకొని ఉపవాస దీక్ష విరమించుకుంటారు. ఇలా చేయడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.దేవాలయం పోలేవారు తులసికోట ముందు ఈ దీపాలను వెలిగించిన పుణ్యఫలం దక్కుతుంది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శివాభిషేకం, కేదారేశ్వరుడి వ్రతం, ఉపవాసం చేయడం మంచి ఫలితాన్నిస్తాయి.