నిన్నటి వరకు అంబులెన్సులు వెళ్తూనే ఉన్నాయి… పడకలు నిండుతూనే ఉన్నాయి…. కేసులు ఇంకా పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. మొదట చిన్న పిల్లలకే మూర్ఛ అని భావించినా, పెద్దలకు కూడా ఇదే లక్షణాలు కనిపించి ఆస్పత్రిలో చేరడం తో ఏలూరు మిస్టరీ ఇప్పుడు వైద్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏం జరిగిందో ఎందుకు జరుగుతుందో దేనివల్ల జరుగుతుందో తేలిక ఇటు వైద్యులు అటు ప్రజాప్రతినిధులు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏం కారణమో తెలుసుకోకుండా చికిత్స చేయడం దానిని నివారించడం సాధ్యం కాని పని. దీంతో సాధారణ చికిత్స చేసి బాధితుని కొందర్ని హడావుడిగా డిశ్చార్జి చేశారు.. అసలు ఏలూరు లో ఏం జరుగుతోంది..???
గత రెండు రోజుల క్రిందట టపటపా చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు వాంతులు-విరేచనాలు వికారం ఫిట్స్ తో కింద పడి పోవడం ఏలూరులో సంచలనం అయ్యింది. దాదాపు 300 మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఒకే రకమైన వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం ఒకేసారి జిల్లాకేంద్ర ఆస్పత్రిలో హాహాకారాలు మిన్నంటడంతో విషయం జాతీయస్థాయి అంశమైంది. ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సొంత నియోజక వర్గంగా ఉన్న ఏలూరులో ఇది జరగడంతో ఇది రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలని భావించిన ఆయనకు అది సాధ్యం కాలేదు. అందరి లక్షణాలు ఒకేలా ఉన్నా వారికి నీరు వల్ల గాలి వల్ల దేని వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైద్యులు కూడా చెప్పలేకపోయారు. వాంతులు వికారం నీటి వల్ల వచ్చే అవకాశం ఉన్నా మూర్చా అనేది నీటి సంబంధం లేనిది. దీంతో గాలి వల్ల కూడా ఇలాంటి వ్యాధి వచ్చిందని పుకార్లు వ్యాపించాయి. కొందరు ఏలూరు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కనిపించింది. హుటాహుటిన వైద్య బృందాలు రంగంలోకి దిగినప్పటికీ కారణాలు తెలుసుకోలేకపోయారు.
ఎంత గొప్పోళ్ళు??
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అందరు సీనియర్ వైద్యులే. శుక్రవారం సాయంత్రం నుంచే కేసులు రావడం మొదలైంది. వాంతులు-విరేచనాలు అన్న వారికి మూర్తి అని వచ్చిన వారికి ఫస్ట్ సెలైన్ లు పెట్టేసి, రెండు బి కాంప్లెక్స్ ఇంజక్షన్లు బలానికి పొడిచేసి వార్డుల్లో జాయిన్ చేశారు. ఇది శనివారం నాటికి మరింత ఉధృతమైంది. కేసులు రాక బాగా పెరిగింది. మొదట డయేరియా లక్షణాలు గా అనుమానించి వైద్యులు చికిత్స ఆరంభించారు. అయితే చిన్నారుల్లో మూర్ఛ రావడంతో విషయం సీరియస్ అయింది. మొదట అయిదు నుంచి పది మంది వరకు పిల్లలకు ఇది కనిపించిన వైద్యులు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఏలూరు వన్ టౌన్ ప్రాంతం నుంచి అధికంగా కేసులు రావడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లిన కేసులను జిల్లా కేంద్ర ఆసుపత్రి చేయడంతో కేసుల సంఖ్య పెరిగింది. దీంతో తీవ్రత ఒకేసారి మీడియా దృష్టికి వెళ్లింది. అప్పటివరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. వచ్చిన వారికి కేవలం సెలైన్ పెట్టి వార్డుల్లో జాయిన్ చేసే వరకే వారు చూశారు తప్పితే, ఏదో జరుగుతుంది అన్నది వైద్యులు గ్రహించి లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. అందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో వైద్యుల తీరు, ఆసుపత్రికి వచ్చిన వారికి సేవలు అందించిన తీరు మొదట అభాసుపాలు అయ్యేలా ఉంది. మీడియాలో పెద్ద ఎత్తున ఏలూరులో ఏదో జరుగుతోందని ప్రచారం జరగడంతో పాటు అప్పటికప్పుడు ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆసుపత్రికి రావడంతో వైద్యుల్లో చలనం వచ్చింది. అత్యవసర విభాగం లో ఉన్న డ్యూటీ డాక్టర్ సైతం ఆ సమయంలో లేరు. ఆళ్ల నాని వస్తున్నారని తెలుసుకున్న తర్వాతే వైద్యులు హుటాహుటిన ఇళ్ల దగ్గర్నుంచి రావడం వారి నిర్లక్ష్యానికి వారి పనితీరుకు అద్దం పడుతోంది. ఇక ఏం జరిగిందో ప్రాథమికంగా తెలుసుకునే బుర్ర ను వైద్యులు పెట్టలేక పోయారు.
రాజకీయ కోణంలో
ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కొందరు టిడిపి నాయకులే నీళ్లలో ఏదో కలిపారు అంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ముందుగానే దీనికి రాజకీయ లంకె పెట్టడం వల్ల ఒరిగిందేమీ లేకున్నా ప్రతిదానికి ప్రతిపక్షాన్ని ఉంటారని కోణంలో ప్రజల్లోకి వెళ్లడం ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి మచ్చ తె చ్చేదే. ఒకేసారి 300 మంది వరకు అస్వస్థతకు గురైతే దానికి రాజకీయాలు లంకె పెట్టడం ఈ సమయంలో ఎవరికీ సముచితం కాదు. అసలు సమస్య ఎక్కడుంది దేనివల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది వెతక్కుండా ఇష్టానుసారం మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు.
తెలుస్తుందా??
ఇప్పటికే ఏలూరు లోని పలు ప్రాంతాల్లో నీరు, ఆహారం ఇతర శాంపిల్స్ను సేకరించారు. హైదరాబాద్లోని ల్యాబ్ లో సైతం ఏమి తేలకపోవడంతో పుణే లోని ప్రధాన వైరాలజీ ల్యాబ్ కు శాంపిల్స్ను పంపినట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం కొసమెరుపు. పంపిన శాంపిల్స్ ఎవరు పంపించారు అనేది వారిలో స్పష్టత లేదు. ఏ శాఖ ఎలాంటి పనులు చేయాలి ఏ ఏ సమయంలో ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఇలాకాలో విపత్తు కాలంలో అధికారుల మధ్య ఉన్న సఖ్యతను తెలిపింది. దీనిపై రేపు ఏలూరు రానున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్య అధికారుల తీరు మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేక కేవలం బాధితుని పలకరించి వెళ్ళిపోతారా అనేది చూడాలి. అంతేకాదు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తీరు అక్కడ నిర్వహణ వైద్యుల పర్యవేక్షణ పనితీరు మీద గతంలోనూ బొలెరో ఆరోపణలు వచ్చాయి. వాటిని తూతూమంత్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ కీలక సమయంలో అయినా కట్ట దిద్దే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది చూడాలి.