రాష్ట్రం గర్వించదగిన కార్యక్రమం అది. దేశం ఆచరించదగిన పథకం అది. వైసీపీ నాయకుడు కాలర్ ఎగరేసుకునే పంపిణీ అది..! నిజమే ఆ కార్యక్రమం సక్రమంగా అమలైతే జగన్ కి తాను ఊహించనంత పాజిటివిటీ వచ్చి పడుతుంది. కానీ ఇప్పుడు జగన్ కి పాజిటివిటి వస్తుందా.. లేదా..? వస్తే ఎంత వస్తుంది..!? పాజిటివ్ రాకపోగా నెగిటివ్ వస్తుందా..!? వస్తే ఎంత వస్తుంది..!?? అసలు “జగనన్న ఇళ్ల పట్టాలు”లో జగన్ కి వచ్చే పాజిటివ్ ఎంత..? ఎందుకు..? నెగిటివ్ ఎంత..? ఎందుకు..? అనేది కీలక అంశాలతో “న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక విశ్లేషణ” చూద్దాం..! ముందు పాజిటివ్స్, తర్వాత నెగిటివ్స్.. చివరిగా విశ్లేషణ చెప్పుకుందాం..!!
అవును దేశం చూడదగినదే..!
30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం అంటే సదా సీదా విషయం కాదు. అందులోనూ 15 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం కూడా మామూలు అంశం కాదు. అందుకే ఈ కార్యక్రమం దేశం చూడదగినది, ఆచరించదగినది. జగన్ తండ్రి వైఎస్సార్ హయాంలో ఇచ్చింది 5 లక్షల ఇల్లు మాత్రమే.., తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇచ్చింది 6 లక్షల ఇల్లు మాత్రమే..! ఆనక చంద్రబాబు హయాంలో కూడా వచ్చింది 11 లక్షల ఇల్లు మాత్రమే. కానీ వీటిలో చాల వరకు పూర్తికాలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలోనే సీఎం జగన్ హయాంలోనే అత్యధిక మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు, అత్యధిక ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భారీ బడ్జెట్ రూ. 59 వేల కోట్లు అంచనాలు వేశారు. ఒక్క సెంటయినా.., ఒకటిన్నర సెంటయినా ఇవ్వడం గొప్ప. అంత మందికి భుముని గుర్తించి, పట్టాలుగా ఇవ్వడం కచ్చితంగా కలర్ ఎగరేయాల్సిన అంశమే. అంటే దీనిలో జగన్ అత్యున్నత లక్ష్యం కనిపిస్తుంది. పేదోడికి సొంతింటి కళను నెరవేర్చాలన్న జగన్ ఆశయం కనిపిస్తుంది. అందుకే ఇది కచ్చితంగా జగన్ కి మేలు చేసే పథకమే.
ఈ మరకలు చాలానే ఉన్నాయిగా..!!
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 15 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి బీభత్స లెక్కలతో సీఎం జగన్ ఒక తెల్ల చొక్కా చూపించారు. కానీ దానిపై నల్లని మరకలను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత అవినీతి ఆరోపణలు వచ్చింది ఈ కార్యక్రమంలోనే. భూముల సేకరణలో అవినీతి కొన్ని చోట్ల నిర్ధారణ జరిగింది.., ఆ భూముల చదునులోనూ కొన్ని చోట్ల అవినీతి భారీగా జరిగింది. ఇవి ఆధారాలతో సహా నిరూపించడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. సరే అవినీతి సహజమేలే అని వదిలేసినా..! 15 లక్షల ఇళ్లు పూర్తి చేయగలరా..? వచ్చే రెండు లేదా రెండున్నరేళ్లలో ఈ ఇళ్లన్నీ నిర్మాణం పూర్తి చేయగలరా..? అనేది పెద్ద ప్రశ్న. దీనికి రూ. 59 వేల కోట్లు కావాలి. కేంద్రం పీఎంఎవై పథకం ద్వారా గరిష్టంగా రూ. 5 వేల కోట్లు కంటే ఎక్కువ ఇవ్వదు. అంటే కనీసం రూ. 54 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సిందే. ఇది సాధ్యమేనా..!? ఈ అప్పులు, ఈ ఆర్ధిక కష్టాల రాష్ట్రంలో అంత డబ్బు పెట్టడం సాధ్యమేనా..!? మరోవైపు గుర్తించిన స్థలాల పట్ల కొన్ని చోట్ల లబ్ధిదారుల్లో నిరాసక్తత వ్యక్తమవుతోంది. నీళ్లలో మునిగేవి, లోతైన భూములు, బురద భూములు, ఊరికి దూరంగా ఇచ్చారని ఆరోపణలు.. కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఇలా అవినీతి, భారీ ఆర్ధిక కష్టాలు, పనికిరాని భూములు అనే మరకలతో కొంత నష్టం వస్తుంది.
మంచి ఎక్కువా..? చెడు ఎక్కువా..!?
ఇక్కడ ఇదే కీలకం. మనం పైన పాజిటివ్, నెగిటివ్ రెండూ చెప్పుకున్నాం. ఇళ్ల పట్టాల వలన జగన్ కి మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా..? ఏది ఎక్కువ అనేది తేల్చడం కష్టమే కానీ. జగన్ లో ఉన్న ఆశయం.. సీఎం స్థాయిలో చూపిన శ్రద్ధ దిగువ స్థాయిలో లేని కారణంగా దక్కాల్సిన మంచి దక్కలేదు అనేది వాస్తవం. కొన్ని చోట్ల అవినీతి జరగడం వాస్తవం.. కొన్ని చోట్ల లబ్ధిదారులు అసంతృప్తిగా ఉండడం వాస్తవం.., ఆర్ధిక కష్టాల నేపథ్యంలో ఇళ్లు పూర్తి చేయడం కష్టమే అనేది వాస్తవం. అందుకే ఇవన్నీ పోవాలంటే రానున్న రెండేళ్లలో ఇళ్లు చూపించాలి. ఇళ్లు కట్టించి ఇవ్వాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. లేకుంటే దీని చెడు ఫలితం, ఈ నెగిటివిటీ రెండేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటుంది..!!