YS Jagan : రాష్ట్రంలో స్థానికి పోరు ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ పరిణామం అధికార వైసీపీ అసలు ఊహించలేదు. ఏదో ఒక కారణంతో ఎన్నికలను అడ్డుకోవచ్చనీ, అవసరం అయితే కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చి నిలుపుదల చేయవచ్చని భావించింది. అయితే కోర్టులు కూడా ఎన్నికల సంఘంకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో స్థానిక సమరం తప్పలేదు. ఎన్నికలకు వైసీపీ భయపడి ఎన్నికలు వద్దని అనడం లేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఊహించని విజయాన్ని అందుకుంది. 50 శాతంకు పైగా ఓట్లతో 151 సీట్లు వైసీపీ సొంతం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి నల్లేరుమీడ నడకే అని చెప్పవచ్చు. అయితే ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఈ ఎన్నికలు జరగకూడదనే పట్టుదలతో కరోనా వ్యాక్సినేషన్ అన్న సాకుతో కోర్టును ఆశ్రయించి ఎన్నికలను నిలుపుదల చేయాలని భావించింది.
YS Jagan : అందరి చూపు విశాఖ పైనే
ఏది ఎలా ఉన్నా ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అందరి చూపు విశాఖ వైపే ఉంది. ఎందుకంటే జగన్మోహనరెడ్డి సర్కార్ మూడు రాజధానుల కాన్సెప్ట్ లో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అయితే విశాఖలో ప్రజలు రాజధానిని కోరడం లేదని వ్యతిరేకిస్తున్నారంటూ విపక్షాలు చెబుతూ వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో మెజార్టీ సర్పంచ్ పదవులు వైసీపీ ఖాతాలో పడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా అంటే సమాధానం కచ్ఛితంగా చెప్పలేకపోతున్నారు. దానికి ప్రధానంగా ప్రతిపక్షాలు చెప్పేది ఏమిటంటే వైసీపీ పాలనలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని. ఆ విషయాన్నే టీడీపీ ఫోకస్ చేయనున్నది.
YS Jagan : విశాఖ ఓటర్ల తీర్పు ఏ రాజధానికి ?
ఇప్పుడు అధికార వైసీపీకి స్థానిక ఎన్నికలు పెద్ద సవాల్ గా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజధాని మార్పు చేస్తామని వైసీపీ చెప్పలేదు. ఎన్నికల తరువాత సీఎం జగన్ పరిపాలనా వికీంద్రీకరణ అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో విశాఖ ప్రాంతంలో ప్రజలు రాజధానికి అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనేది ఇప్పుడు స్పష్టమయ్యే పరిస్థితి ఉంది. దీంతో అధికార పార్టీ నేతలు విశాఖ ప్రాంతంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారని అంటున్నారు. అక్కడ అనుకూల ఫలితాలు వస్తే జగన్ తీసుకున్న నిర్ణయానికి జై కొట్టినట్లు అవుతుంది. అలా కాకుండా ప్రజల తీర్పు వ్యతిరేకంగా వస్తే తెలుగుదేశం పార్టీతో ఇతర పార్టీలకు అమరావతి రాజధాని విషయంలో మరింత గట్టిగా గళం ఎత్తే అవకాశం ఏర్పడుతుంది. విశాఖ ప్రాంతంలో మెజార్టీ సర్పంచ్ లు కైవశం చేసుకోకపోతే జగన్ కు గట్టి షాక్ తగిలినట్లే అవుతుందని అంటున్నారు. చూడాలి మరి విశాఖ ప్రజల తీర్పు రాజధానికా, అమరావతికా అనేది.