Lock Down: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా కల్లోలం , వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్ డౌన్ వలే… తెలంగాణలోనూ లాక్ డౌన్ అమలు చేయనున్నారా? వివిధ వర్గాలు వ్యక్తీకరిస్తున్న అభిప్రాయాలకు తలొగ్గి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారా? అసలు తెలంగాణలో లాక్ డౌన్ చాన్స్ లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ నేడు పూర్తి క్లారిటీ రానుంది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కేసీఆర్ మదిలో ఏముంది?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంనది. తెలంగాణలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా ఉంది. అయితే, దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదక బాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
కేంద్రం కీలక ప్రకటన
మరోవైపు కోవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ఫ్యూ లక్డౌన్ కంటెయిన్ మెంట్ జోన్ ల విధింపు పై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా స్పందించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి అందిన ఆక్సిజన్ పంపిణి బాధ్యత కూడా రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందిపడకుండా అవసరాన్ని గుర్తించి విదేశాల నుంచి యుద్ధవిమానాల తో ఆక్సిజన్ తెస్తున్నామని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపులు చేస్తున్నామన్నారు.