తగ్గుతున్న పురుష ఉద్యోగులు
కార్మిక మంత్రిత్వశాఖ నివేదిక
తొక్కిపెట్టేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: మగవాళ్లకు పని లేకుండా పోతోందట! కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ వద్ద సిద్ధంగా ఈ వివరాలన్నీ ఉన్నా ఇంతవరకు దాన్ని బయటపెట్టకుండా తొక్కి పెట్టేశారు. 2017-18 సంవత్సరానికి సంబంధించిన సమాచారం ప్రకారం, ఉద్యోగాలు చేసే మగవాళ్ల సంఖ్య 28.6 కోట్లుగా ఉంది. అదే 2011-12 నాటికి ఇది 30.4 కోట్లు. పట్టణ ప్రాంతాల్లో 7.1 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 5.8 శాతానికి నిరుద్యోగం పెరిగింది. 1993-94 తర్వాత తొలిసారిగా పనిచేసే మగవాళ్ల సంఖ్య తగ్గింది. ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017-18ను ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రిక బయటపెట్టింది. దేశంలో పురుష ఉద్యోగులు 28.6 కోట్ల మంది ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. 1993-94లో 21.9 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య అప్పటినుంచి క్రమంగా పెరుగుతూ 30.4 కోట్లకు వచ్చింది తప్ప ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పుడు తొలిసారి పురుష ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఇంతకుముందు ఇలాంటి సర్వే 2011-12 సంవత్సరంలోనే నిర్వహించారు. అంటే, ఐదేళ్ల క్రితం నాటికంటే ఇప్పుడు ఎక్కువ మంది మగాళ్లు పనీపాటా లేక తిరుగుతున్నారన్న మాట. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా 6.4% చొప్పున ఉంది. అదే పట్టణాల్లో అయితే 4.7%గా ఉంది.
ఎలా తొక్కి పెడతారు?
ఇలాంటి సమాచారాన్ని బయటపెట్టకుండా తొక్కేయడం సరికాదని పేరు చెప్పని ఆర్థికవేత్తలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి సమాచారంపై మరింత పరిశోధన అవసరమంటున్నారు. కొత్త ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని విశ్లేషించారు. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు పీఎల్ఎఫ్ సర్వే నిర్వహించారు. దాని ఆధారంగా ఎన్ఎస్ఎస్ఓ నివేదిక రూపొందించారు. జాతీయ గణాంక కమిషన్ తాత్కాలిక చైర్మన్ పీసీ మోహనన్, మరో సభ్యురాలు జేవీ మీనాక్షి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేశారు. కమిషన్ ఆమోదించిన నివేదికను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వారు మనస్తాపానికి గురయ్యారు.
గ్రామాలకే ఎక్కువ నష్టం
గ్రామీణ ప్రాంతాల్లో 2017-18 సంవత్సరం నాటికి 4.3 కోట్ల ఉద్యోగాలు పోతే, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల ఉద్యోగాలు పోయినట్లు ఎన్ఎస్ఎస్ఓ సమాచారం తెలియజేస్తోంది. ఉద్యోగాలు పోయినవారిలో గ్రామీణ ప్రాంతాలలో 68% మహిళలు, పట్టణ ప్రాంతాల్లో 96% మంది పురుషులు బాగా ఇబ్బంది పడ్డారు. 2011-12తో పోలిస్తే భారతదేశం మొత్తమ్మీద 4.7 కోట్ల ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఇది సౌదీ అరేబియా జనాభా కంటే ఎక్కువ. ఎన్ఎస్ఎస్ఓ రూపొందించిన సమాచారంలో జనాభా వివరాలు, ఆడ..మగ, కార్మికశక్తి భాగస్వామ్య రేటు, మొత్తం జనాభాలో ఉద్యోగాలు తదితర వివరాలుంటాయి.
పెరిగిన నిరుద్యోగం
2017-18లో నిరుద్యోగం రేటు మొత్తమ్మీద 6.1 శాతం ఉందని పీఎల్ఎఫ్ఎస్ నివేదిక చెప్పింది. 2011-12తో పోలిస్తే ఇది 2.2 శాతం ఎక్కువ. ఈసారిలాగే, 2011-12లో కూడా గ్రామీణ మహిళల్లో ఉద్యోగాలు బాగా తగ్గాయని ఎన్ఎస్ఎస్ఓ సర్వే చెప్పింది. అదే గ్రామీణ పురుషులకు మాత్రం అప్పుడు ఉద్యోగాలు పెరిగాయి. 2004-05, 2011-12 సంవత్సరాల మధ్య గ్రామీణ మహిళల ఉద్యోగాలు 2.2 కోట్ల మేర తగ్గాయి. అదే సమయంలో గ్రామీణ పురుషుల ఉద్యోగాలు 1.3 కోట్లు పెరిగాయి. దీనివల్ల ఆ సమయంలో మొత్తం పోయిన ఉద్యోగాలు 90 లక్షలుగా తేలాయి. పీఎల్ఎఫ్ఎస్ 2017-18 ప్రకారం పని చేసే వయసులో ఉన్నవారికి వృత్తి / సాంకేతిక శిక్షణ అందిన సందర్భాలు కూడా 2011-12లో 2.2 శాతం ఉండగా 2017-18లో 2 శాతానికి తగ్గాయి. అదే 15-29 సంవత్సరాల మధ్య గ్రూపులో మాత్రం ఈ శిక్షణ అందిన సందర్భాలు 0.1 శాతం పెరిగాయి.