Etala Rajender: ఈటల రాజేందర్ Etala Rajender టీఆర్ఎస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అప్పటివరకూ రాజకీయ నేపథ్యంలేని ఈటల ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు. కేసీఆర్ వెంట నడిచారు. టీఆర్ఎస్ లో నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీలో టీఆర్ఎస్ తరపున తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని బలంగా వినిపించారు. రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మంత్రిగా.. పార్టీలో, క్యాబినెట్ టాప్ 5లో నిలిచారు. ఇంతగా ఎదిగిన ఈటలకు ఇటివలి రాజకీయ పరిస్థితులు ఏకంగా టీఆర్ఎస్ నుంచి బయటకువెళ్లేలా చేశాయి. మొత్తంగా ఆయన టీఆర్ఎస్ ను వీడారు. బీజేపీలో చేరారు. అయితే.. ఆయన చేరికకు బీజేపీ ఎంత ప్రాధాన్యం ఇచ్చిందనేదే ప్రశ్నార్ధకంగా మారింది.
టీఆర్ఎస్ లో ఎదురైన పరాభవంతో ఈటల బీజేపీవైపు దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం అయ్యారు. తన హోదాకు తగ్గట్టు బీజేపీలో సముచిత స్థానం ఆశించారు. ఈటల రాజకీయ ప్రస్థానం, హుజూర్ నగర్ లో ఆయనకు ఉన్న ప్రజాదరణ చూసి బీజేపీ ఓకే అంది. ముహూర్తం కుదిరి నిన్న ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అయతే.. ఆ కార్యక్రమంలో నడ్డా పాల్గొనలేదు. టీఆర్ఎస్ లో మంత్రి కాబట్టి, కేసీఆర్ గురించి తెలిసిన నాయకుడు పార్టీలో చేరుతున్నారు కాబట్టి హోంమంత్రి అమిత్ షా కూడా ఆయనకు పార్టీ కండువా కప్పుతారని ఆశించారు. కానీ.. ఇవేమీ జరగకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
Read More: Target Etala Rajendar: నాయకులకు ఇన్నోవాలు, లక్షలు..! ఈటల కోటలో గేమ్ మొదలు పెట్టిన టీఆరెస్..!?
కేవలం.. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్.. మాత్రం పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ నాయకుడే కానీ.. బీజేపీలో ముఖ్యమైన నాయకుడేమీ కాదనేది టీఆర్ఎస్ శ్రేణుల వాదన. ఈటల బీజేపీలో చేరి తప్పిదమే చేశారని అంటున్నారు. వీరి వాదన ఎలా ఉన్నా.. ఈటల చేరిక బీజేపీకి ఇష్టముందా? అక్కడ దెబ్బతిని వచ్చారు కాబట్టే అమిత్ షా, నడ్డా వంటి నాయకులు లైట్ తీసుకున్నారా? అనే ప్రశ్నలు రాకమానవు. మరి.. ఈటల రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో.. చూడాలి.