MANSAS TRUST: ఉత్తరాంధ్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించే.. సింహాచల దేవస్థానం బోర్డు సహా.., మన్సాస్ ట్రస్టు చైర్మన్ వివాదం కూడా కోర్టు జోక్యంతో ఓ కొలిక్కి వచ్చింది. ఈ రెండు ట్రస్టులకు చైర్మన్ గా సంచయితా గజపతిరాజు నియామకం చెల్లదంటూ నిన్న తీర్పు రావడంతో వివాదం ముగిసినట్టే. దీంతో అశోక్ గజపతిరాజు వర్గం సంబరాల్లో మునిగింది. ఇక్కడితో సరికాదు, ఇప్పుడు వారిపై కొన్ని కీలక బాధ్యతలు ఉన్నాయి. మరకలు తుడవాల్సింది వాళ్ళే.. లేదా ఫలితం అనుభవించాల్సింది కూడా వాళ్ళే..
MANSAS TRUST: ఇదీ ట్రస్ట్ చరిత్ర..!
మన్సాస్ ట్రస్ట్ కొన్ని దశాబ్దాల చారిత్రిక నేపథ్యం ఉంది. ఈ ట్రస్ట్ 1958 నవంబరులో ఏర్పడింది. మన్సాస్ అంటే (మహారాజా అల్లక్ నారాయన్ సొసైటీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్) అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజుల తండ్రి రాజా సాహెబ్ పీవీజీ రాజు గారు ఆయన తండ్రి అల్లక్ నారాయణ్ స్మారకంగా ఏర్పాటు చేశారు. 1857 నుండి ఈ వంశానికి అక్కడక్కడా కళాశాలలు, దేవాలయాలు ఉన్నప్పటికీ అన్నిటికీ ఒక ట్రస్ట్ పరిధిలోనికి తీసుకొస్తూ 1958లో ఈ ట్రస్ట్ ఏర్పాటయింది. 1995 వరకు పీవీజీ రాజు చైర్మన్ గా ఉన్నారు. ఈ ట్రస్ట్ పరిధిలో 108 దేవాలయాలు, అనేక విద్యాసంస్థలు.. 14,800 ఎకరాల భూమి ఉంది.
Must Read it: OTT New Trend in Telugu.. ఓటీటీలు సరఫరా చేస్తున్న బూతు
ఇదీ వివాదాల నేపథ్యం..!
* 1995 లో పీవీజీ రాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 2016 లో ఈయన మరణం తర్వాత అశోక్ గజపతి రాజు ఈ బాధ్యతలు తీసుకున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత .. 2020 మార్చి నెలలో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ ట్రస్ట్ కి చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజుని తొలగించి ఆయన స్థానంలో సంచయిత గజపతిరాజుని నియమించారు. ఈ ట్రస్ట్ కి పురుషులే చైర్మన్ గా ఉండాలని, ఈ నియామకం చెల్లదని, నిబంధనలకు విరుద్ధమంటూ అశోక్ గజపతిరాజు వేసిన పిటిషన్ పై హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. దీంతో ట్రస్ట్ చైర్మన్ గా మళ్ళీ అశోక్ గజపతిరాజు నియమితులైనట్టే. కానీ…
15 నెలల్లో ఎన్నో మరకలు..!!
సంచయిత గజపతిరాజు నియామకమే ఒక వివాదం అయితే.. చైర్మన్ గా ఆమె వ్యవహారశైలి మరింత వివాదాస్పదంగా మారింది. ఎన్నడూ లేని, మునుపెన్నడూ ఊహించని కొత్త నిర్ణయాలు తీసుకుని వార్తల్లోకెక్కారు. ట్రస్ట్ కి నష్టం కలిగించేలా, ట్రస్ట్ లక్ష్యాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ అనేక సార్లు అశోక్ గజపతి సహా ఆ కుటుంబ సభ్యులు కొందరు మీడియా ముందుకు వచ్చారు. వాటిలో ముఖ్యమైనవి..
* సింహాచలం దేవస్థానంలో రహస్య పత్రాలను, భూముల వివరాలను పరిశీలించడానికి ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించడం వివాదాస్పదమైంది. గత ఏడాది జులై నుండి నవంబర్ వరకు సుమరుగా 5 నెలలు ఆ వ్యక్తి దేవస్థానం పరిధిలోని కాన్ఫిడెన్షియల్ పత్రాలు పరిశీలించారు. అనధికారికంగా రాజభోగాలు పొందారు. కొందరు ఉద్యోగులను తొలగించారు. పెత్తనం చెలాయించారు. దీంతో దేవస్థానం పరిపాలన దెబ్బతిన్నది. నష్టాల్లోకి వెళ్ళింది. దీన్ని సరిదిద్దాల్సి ఉంది.
* దేవస్థానం పరిధిలోని కొన్ని భూముల్లో సర్వే చేసారని, ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేశారని.., అనధికార నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్థూలంగా దృష్టిపెట్టాల్సి ఉంది.
* ట్రస్ట్ అధికారులు సహా దేవస్థానం ఈవోలు కూడా తరచుగా బదిలీ జరిగేవారు. నిబంధనలకు విరుద్ధంగా సంచాయితా నిర్ణయాలు ఉండేవని.., ఇలా చేయడం ట్రస్ట్ కి నష్టమని చెప్పినా ఆమె వినలేదని ఆరోపిస్తూ కొందరు ఉద్యోగులు ఆరోపించేవారు. కొందరు ఈవోలు బదిలీ కోరుతూ సెలవులు పెట్టేసారు.
* ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాజ్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని సంచయిత నిర్ణయించారు. సుమారు 5 వేల మంది విద్యార్థులున్న ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేసి, దీని పేరిట ఉన్న భూములను అమ్మాలని నిర్ణయించడం పెద్ద వివాదంగా మారింది. అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఆందోళనలు చేశారు.
* ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పని చేసే సిబ్బందికి కొన్ని నెలల పాటూ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. సక్రమంగా చెల్లించలేదు. ఆర్ధిక లావాదేవీలు స్తంభించి, ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బతిన్నది.
* ట్రస్ట్ ఆధ్వర్యంలోని భూముల్లో 15 శాతం ఆక్రమణలో ఉన్నాయి. కొన్ని అధికారికంగా లీజుకి ఇవ్వగా.., కొన్ని అనధికారికంగా కొందరు అనుభవిస్తున్నారు. ఈ ఏడాది వ్యవధిలో పెద్దగా పట్టింపు లేకపోవడంతో ఈ ఆక్రమణలు పెరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను రక్షించుకోవాలి.