TTD Chairman: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఈ పదవి కోసం రాజకీయ నేతలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అవసరమైతే ఎన్ని కోట్ల రూపాయలు అయినా పార్టీ ఫండ్ ఇవ్వడానికి సిద్ధమవుతారు. శ్రీవారి సేవ చేసే అదృష్టం రావడమే మహాభాగ్యంగా భావించే ఎందరో నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. కనీసం డైరెక్టర్ పదవి లభించినా చాలు అనుకునే వారు ఏపితో సహా పలు రాష్ట్రాలలో నేతలు ఉన్నారు. డైరెక్టర్ పదవులకే కేంద్ర మంత్రులు సిఫార్సు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటికే ఒక పర్యాయం టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన వైవీ సుబ్బారెడ్డి మరో సారి ఆ పదవిలో కొనసాగడానికి సముఖత చూపడం లేదని సమాచారం.
టీటీడీ చైర్మన్ గా ఉంటే ప్రత్యక్ష రాజకీయాల నుండి దూరంగా ఉండాల్సి వస్తోందని దీంతో తన వర్గీయులకు న్యాయం చేయలేకపోతున్నానన్న భావనతో వైవీ సుబ్బారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించాలన్నది ఆయన మనోగతంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సందర్భంలో టీడీపీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పేరు మరో సారి ప్రతిపాదించింది. దీనిపై సుముఖంగా లేని వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా అమెరికా వెళ్లిపోయారు. అయితే వైవీ సమ్మతించారో లేదో కానీ ప్రభుత్వం ఆయనను టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకమండలి సభ్యులను మాత్రం ఈ రోజు ప్రభుత్వం ప్రకటించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కమిటీ నియామకం ఉంటుందని తెలుస్తోంది.
కాగా పాలకమండలిలో చోటు కోసం చాలా మంది వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గత పాలకవర్గంలో సభ్యుల సంఖ్యను 18 నుండి 37 కి పెంచి జెంబో పాలకమండలిని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు అన్ని పూర్తి చేయడంతో పదవులు దక్కని వారు టీటీడీలో చోటు కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారని సమాచారం.