Indian railway: ఇండియన్ రైల్వేస్లో IRCTC క్యాటరింగ్ సర్వీసెస్ కీలక భూమిక పోషిస్తుంది. ప్రపంచంలోనే భారతీయ రైల్వే నెట్వర్క్ చాలా పెద్దది. రోజూ కోట్ల సంఖ్యలో ప్రజలు జర్నీ చేస్తుంటారు. వారందరికీ IRCTC భోజనం సరఫరా చేస్తుంటుంది. ఇందులో అన్ని రకాల ఫుడ్ దొరకుతుంది. ఆహారం క్వాలిటీని బట్టి ధరలు నిర్ణయిస్తుంది ఈ సంస్థ.. కొవిడ్ మహమ్మారి కారణంగా ఇన్ని రోజులు క్యాటరింగ్ (catering) సేవలను నిలిపివేసిన ఐఆర్సీటీసీ.. తిరిగి రైళ్లలో తమ సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది.
ఏయే రైళ్లలో ఈ సదుపాయం..
ఇండియన్ రైల్వేస్లో ఐఆర్సీటీసీ సంస్థ కొన్ని రైళ్లలో మాత్రమే తాజా (వండిన ఆహారం)ను సప్లయ్ చేస్తుంది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, గతిమాన్ ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణికుల ఆర్డర్ మేరకు భోజనం తమ సీట్స్ వద్దకు తెచ్చి అందిస్తుంది. మిగతా రైళ్లలో రెడీ టు మీల్ పుడ్ పార్సిల్ సర్వీసెస్ను కూడా అందిస్తోంది. కొవిడ్ టైంలో రెడీ టు మీల్ మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇప్పుడు కొవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్యాజింజర్స్కు తాజా ఆహారం అందించడానికి IRCTC ముందడుగు వేసింది. అయితే, ఎప్పటినుంచి అందిస్తామని పక్కాతేదీలను ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది.
IRCTC వెబ్సైట్ ద్వారా ఫుడ్ ఇలా పొందండి..
ప్యాసింజర్స్ ఈ క్యాటరింగ్ ఆఫీషియల్ వెబ్సైట్ https://www.ecatering.irctc.co.in/కి లాగిన్ అవ్వాలి. అందులో పది అంకెల PNR నెంబర్ ఎంటర్ చేసి తర్వాత యారో మార్క్ (బాణం గుర్తు) మీద క్లిక్ చేయాలి. అందుబాటులో ఉన్న కేఫ్స్, అవుట్ లెట్స్, క్విక్ సర్వీసెస్, రెస్టారెంట్ల ద్వారా ఆహారం బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ మోడ్ ఎంపిక చేసుకుని ప్రీ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ చేయచ్చు.