AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతోందనీ, ఏపి హైకోర్టు జగన్ సర్కార్ కు వ్యతిరేకం అంటూ ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ రెండున్నర సంవత్సరాల్లో అనేక విషయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా కూడా హైకోర్టు తీర్పులు వచ్చాయి. అయితే ఇవి మీడియాలో హైలెట్ కావడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే తీర్పులు మాత్రమే మీడియాలో హైలెట్ అవుతుంటాయి. దీంతో ఏపి న్యాయ వ్యవస్థపై అపవాదులు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇటీవల రిటైర్డ్ న్యాయమూర్తి, జై భీమ్ ఫేమ్ జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. దీనిపైనా ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా మరో న్యాయమూర్తి స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి చట్టపరిధిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టే అవకాశం ఉండదు. మెరిట్స్ ఆధారంగా హైకోర్టు తీర్పులు, వ్యాఖ్యలు ఉంటాయనేది మరో సారి రుజువు అయ్యింది.
AP High Court: ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం
రాష్ట్ర ప్రభుత్వం వక్ప్ ట్రిబ్యునల్ ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు గత నెల 25వ తేదీన జీవో నెం.16ను జారీ చేసింది. అయితే ఈ జివోను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మహమ్మద్ ఫరూక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమర్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ ధర్మాసనం విచారణ జరిపింది. జీవో నెం.16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేదం లేదని తేల్చి చెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.
కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటి..?
ప్రభుత్వం నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాధమిక హక్కులకు భంగం కలగవని పేర్కొంది. విశాఖపట్నం, అనంతపురం నుండి హైకోర్టుకు వస్తున్నారనీ, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్ ను ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్ కు వచ్చిన నష్టం ఏమిటని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటునకు దారి తీసిన కారణంతో చిన్న అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి మూడవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది ప్రసాదబాబు వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపించారు.