Megastar Chiranjeevi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. భేటీ ముగిసిన అనంతరం చిరంజీవితో సహా సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషంగా ఉందని అన్నారు చిరంజీవి. చిన్న సినిమాలపై జగన్ నిర్ణయం సంతోషం కల్గించిందని చెప్పారు. పరిశ్రమ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారనీ, ఈ నెలాఖరులోగా జీవో విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయిదవ షోకు సీఎం జగన్ అడిగిన వెంటనే ఆమోదం తెలిపారన్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ కు పరిశ్రమ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. టికెట్ల ధరలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని చెప్పారు.
Megastar Chiranjeevi: విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి
తెలంగాణలో పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందిందో ఏపిలో కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు. విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారనీ, విశాఖలో షూటింగ్ లు జరిగే విధంగా తాము అంగీకరించామనీ, అందుకు ప్రభుత్వం ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారన్నారు. భారతదేశంలో తెలుగు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కీర్తిస్తున్నారు. దానికి ప్రధాన కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు తెలుగు వారు తీసే స్థాయికి రావడమని అన్నారు. ఆ సినిమాలకు భారతదేశ పరంగానే కాకుండానే పాన్ ఇంటర్నేషనల్ ప్రపంచ పరంగా తెలుగు సినిమాలకు ఎంతో కీర్తి వస్తోందని చిరంజీవి అన్నారు. వీటి కోసం ప్రత్యేక వెసులుబాటు కోసం కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పడం పట్ల తామకు సంతృప్తికరంగా ఉందన్నారు చిరంజీవి. ఇకపై మరింత ప్రోత్సాహాంగా పరిశ్రమ ముందుకు వెళుతుందని చిరు పేర్కొన్నారు. మహేష్ బాబు మాట్లాడుతూ చిరంజీవి చొరవతో పెద్ద రిలీఫ్ వచ్చిందన్నారు. ఆరు నెలలుగా నెలకొన్న సంక్షోభం తొలగిపోతుందనీ, ఈ సందర్భంగా సీఎం జగన్, మంత్రి పేర్నినాని, చిరంజీవిలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన వైఎస్ జగన్ కు, ప్రభుత్వానికి ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు.
నంది అవార్డులు వచ్చే విధంగా చూడాలి
ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యంతో ఈ సమస్య పరిష్కారం అవుతోందని ఇతర సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. ఈ సారి జరిగే సమావేశాలకు ప్రోడ్యూసర్ కౌన్సిల్, ఫిలిమ్ ఛాంబర్ లను ఆహ్వానించాలని కోరారు ఆర్ నారాయణమూర్తి. నంది అవార్డులు వచ్చే విధంగా కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాలని నారాయణమూర్తి కోరారు. ఇదే సందర్భంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని కొందరికి పరోక్షంగా చురకలు అంటించారు. ఎవడు పడితే వాడు, ఏది బడితే అది మాట్లాడినా చిరంజీవి పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కోరిక మేరకు విశాఖపట్నంలో సినిమాల నిర్మాణానికి సినీ ప్రముఖులు అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక చొరవ తీసుకున్న చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, దిల్ రాజు, నిరంజన్ రెడ్డి, ఆలీ, తదితరులు పాల్గొన్నారు.