ఏపి తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సినీ నటి దివ్యవాణి కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వీడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయలేదు కానీ ఆయన కోటరీలోని ఓ ముఖ్యనేతపై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చేశారు. ఆయితే ఉండేది హైదరాబాద్ అయినప్పటికీ గుంటూరు జిల్లా తెనాలి కావడంతో ఏపి రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన దివ్యవాణి తన సినీ గ్రామర్ కు తోడు వాక్ చాతుర్యం ఉండటంతో టీడీపీ అధికార ప్రతినిధిగా నియమితులైయ్యారు. మీడియా సమావేశాల్లో అధికార పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేసి టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.
పార్టీ మహానాడు లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఇతర కారణాలతో అవమానానికి గురయ్యానంటూ ఆరోపణలు చేసి మే నెలలో పార్టీని వీడారు. ఆ తర్వాత వైసీపీలో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ ఆ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తన స్థిర నివాసం హైదరాబాద్ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావించారో లేక జాతీయ పార్టీలో చేరితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించవచ్చని భావించారో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరడానికి సిద్దమైనట్లు సమాచారం. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ అయిన ఈటల రాజేందర్ తో గురువారం భేటీ అయ్యారు.
రాజకీయాల్లో సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవాలని ఇప్పటికే బీజేపీ సినీ సెలబ్రిటీలకు గేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో నితిన్ భేటీ అయ్యారు. ఇక సినీనటి జయసుధ కూడా కమలం తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమైయ్యారు కానీ కొన్ని డిమాండ్ లు పెట్టినట్లు సమాచారం. ఈ తరుణంలో దివ్యవాణి షామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో దివ్యవాణిని బీజేపీలోకి ఈటల ఆహ్వానించినట్లు తెలుస్తొంది. దివ్యవాణి కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక పార్టీ కండువా కప్పుకునే ముహూర్తం ఎప్పుడు..ఎవరితో కప్పించుకుంటారు .. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Divyavani Resign: చంద్రబాబుకు దివ్యవాణి రాజీనామా లేఖ.. మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు