Deepavali festival :ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని బహుళ అమావాస్య రోజున వచ్చే దీపావళి పండుగను ప్రజలు అందరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు మొదట ఎదురుచూసే పండగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి అంటేనే దీపాల పండగ. ఇల్లంతా దీపాలతో అలంకరించి ఆనందంగా,ఉత్సహంగా టపాకాయలు కాల్చుకుంటారు.ఈ పండగ పర్వదినాన ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్లు, దీపాల కాంతులతో సందడి వాతావరణం నెలకొంటుంది.దీపావళి అంటే దీపోత్సవం అన్నమాట. అంటే దీపావళి రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పారద్రోలి జగత్తును తన కాంతి కిరణాలతో తేజోవంతం చేస్తుంది.
దీపావళి రోజున ఏమి చేయాలంటే..?
అయితే దీపావళి పండగ వేళ సర్వశుభాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం.లక్ష్మి దేవి రాకతో ఇంద్రుడికి పోయిన సంపదంతా తిరిగి వచ్చిన కారణం చేత దీపావళి రోజున అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తూ దీపాలు వెలిగిస్తారు.ఈ పండగ శుభదినాన స్త్రీలు అభ్యంగన స్నానం చేసి,కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి,గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాసి గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం వేళ లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు.లక్ష్మి దేవికి నైవేద్యంగా రకరకాలైన పిండివంటలు సిద్దం చేయాలి. అలాగే మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీపాలు పెట్టాలి.అసలు ఈ దీపావళి పండుగ యొక్క విశిష్టత ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి పండగ విశిష్టత :
దీపావళి పండగ జరుపుకోవడానికి ఒక్కో యుగంలో ఒక్కొక్క కధ ఉంది. త్రేతాయుగం ప్రకారం సీతమ్మ తల్లిని అపహారించిన రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి దీపావళి నాడే తన రాజ్యం అయిన అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. 14 ఏళ్ల వనవాసం చేసిన తర్వాత రాముడు అయోధ్యకి రావడంతో ప్రజలందరూ ఆ రోజు ఆవునెయ్యితో దీపాలు వెలిగించి శ్రీరాముడిని రాజ్యంలోకి ఆహ్వానిస్తూ బాణాసంచా కాల్చారు. అలా ఆరోజు ప్రజలు రావణాసుడిని వదించి రాముడు మళ్ళీ రాజ్యంలోకి అడుగుపెట్టాడని, చేడుపై మంచి విజయం సాధించిందని ఆనందంగా దీపావళి చేసుకున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటికీ మనం కొనసాగిస్తు వస్తున్నాం.అలాగే ద్వాపర యుగకాలంలో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు నరకాసురుడు వద్ద బందీగా ఉన్న 16 వేల మంది యువతులకు విముక్తి కలిగించాడు. అలా శ్రీ కృష్ణుడు నరకాసురునిపై సాధించిన విజయాన్ని దీపావళిగా ప్రజలందరూ జరుపుకున్నారు.