CM KCR TSRTC: రాజకీయంగా ఏపీ సీఎం జగన్ తో పోల్చుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మోస్ట్ సీనియర్. కానీ కొన్ని కీలక నిర్ణయాల్లో జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాలనే అనుసరించాల్సిన పరిస్థితి ఆయనకు కలుగుతోంది. సహజంగానే ఇరుగు పొరుగు రాష్ట్రాలు కావడంతో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఇక్కడి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఉంటారు. తెలంగాణ అధికార పార్టీ నేతలు పలు సందర్భాల్లో ఏపీ పరిస్థితి గురించి అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు చూశాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఎన్నికల అనంతరం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
రాష్ట్ర విభజన జరగక ముందు నుండి అనేక సంవత్సరాలుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఉంది. ఏపీలో జగన్మోహనరెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. కానీ తెలంగాణలో ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ప్రయత్నం జరిగింది. ఈ తరుణంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు పలు డిమాండ్ల సాధన కోసం కార్మికులు దాదాపు 52 రోజుల పాటు సమ్మె చేసినా కేసీఆర్ సర్కార్ దిగిరాక పోగా ఉద్యోగులందరినీ ఇంటికి పంపించే హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వంలో విలీనం సంగతి దేవుడు ఎరుగు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయకుంటే చాలు అన్న రీతిలో ఆర్టీసీ కార్మికులు 52 రోజుల సమ్మె తర్వాత బేషరతుగా విధుల్లోకి చేరారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణలో అదే ఊపుతో పార్టీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలతో ముందుకు వెళుతోంది. కాంగ్రెస్ సీనియర్ లు విభేదాలు పక్కన పెట్టి సమైక్యంగా బీఆర్ఎస్ పై పోరుకు సిద్దమైయ్యారు.
మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దూరమవుతున్న వర్గాలను దగ్గర చేర్చుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. దీంతో వేల సంఖ్యలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు కేసిఆర్. ఇవేళ జరిగిన కేబినెట్ భేటీలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటిఆర్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు, నిబంధనలు రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటిఆర్ వెల్లడించారు. అప్పుడు కాదన్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala: ఆగష్టు 16 నుండి 19వ తేదీ వరకు టీటీడీలో వస్త్రాల ఈ – వేలం