Modi: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ సంస్థలు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటూ సర్వే నివేదికలు ఇస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ స్ట్రాంగ్ గా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేరుగా ఎదుర్కోలేక పొత్తుల కోసం వెంపర్లాడుతోందన్న మాటలు వినబడుతున్నాయి. జనసేనతో టీడీపీ పొత్తుపై దాదాపు ఖరారు అయ్యే పరిస్థితులు ఉన్నా బీజేపీతోనూ జత కట్టాలని టీడీపీ భావిస్తొంది. అందుకే చంద్రబాబు బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మరల ఎన్డీఏ గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నా అటు నుండి సానుకూల సంకేతాలు ఇంత వరకూ రాలేదని అంటున్నారు.
కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న మోడీ ..ఏపీ విషయంలో ఆచిచూసి వ్యవహరించాలన్న ధోరణిలో ఉన్నారని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న దానిపై బీజేపీ పెద్దల వద్ద సర్వే నివేదక ఉందని ప్రచారం జరుగుతోంది. కొందరు ముఖ్య నేతలు ఏపిలోని రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ వాటి రిపోర్టులను బీజేపీ పెద్దలకు అందిస్తున్నారుట. దాని ప్రకారమే ఏపీలో బీజేపీ రూట్ మ్యాప్ ను రెడీ చేసుకోవాలని భావిస్తొందట.
తాజాగా అందిన సర్వే రిపోర్టులో ఏపీలో వైసీపీకే ఆధిక్యత ఉందని, 50 శాతంకుపైగా వైసీపీకి ఓటు బ్యాంకు ఉందని అంటున్నారుట. అలాగే రాష్ట్రంలో ఉన్న 25 లోక్ సభ స్థానాల్లో 18 ఎంపీ సీట్లు తగ్గకుండా వైసీపీకి వస్తాయని కూడా ఆ సర్వే నివేదికలో తేలిందని అంటున్నారు. ఈ కారణంగా ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉందని అంటున్నారు. కేంద్రంలో మరో సారి అధికారంలోకి రావాలంటే బీజేపీకి ఏపీ ఎంపీల మద్దతు అవసరం. ఏపీలో అధికార పార్టీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏమీ లేదు. ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో బలోపేతం కాలేదు పొత్తుల విషయంపై స్పష్టత లేదు. ఈ కారణంగా ఏపీలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్తంగా ఉంటే మొత్తం 25 ఎంపీల మద్దతు ఎన్డీఏకే దక్కుతుందన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారుట.
ఏపీలో మళ్లీ విజయం పై అధికార వైసీపీ ధీమాగా ఉంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపుకు కారణం అవుతుందని పేర్కొంటున్నారు. ఇంత వరకూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు 95 శాతం హామీలను నెరవేర్చామని వైసీపీ పేర్కొంటోంది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రతి మీటింగ్ లోనూ తమ కుటుంబాల్లో మంచి జరిగిందని భావిస్తేనే తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికి లక్షల రూపాయల లబ్ది చేకూర్చామని ప్రభుత్వం చెబుతోంది. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మించి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందిస్తామని హామీలు ఇస్తున్నా ప్రస్తుతం జరుగుతున్న దాన్ని వదిలివేసి ప్రజలు కొత్త మోజులో పడతారా అనేది అనుమానమే.
ఇప్పుడు హామీ ఇస్తున్న వాళ్లు ఈ మాదిరిగా 2014 నుండి 2019 వరకూ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి పథకాలు ఎందుకు అమలు చేయలని అంటున్నారు. అంతే కాకుండా వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందుతుండగా, విపక్షాలు దీనిపై విమర్శలు చేయడం మైనస్ గా భావిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ అయిందన్న భావన అందరిలో ఉంది. ఏపీలో బలంగా ఉన్న వైసీపీని దూరం చేసుకోవడం ఇష్టం లేకనే బీజేపీ పెద్దలు టీడీపీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నా ఏమీ తేల్చకుండా మౌనందాలుస్తొందని అంటున్నారు.