YSRCP – Allagadda: రాబోయే ఎన్నికల్లో మరో సారి గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధులను ఎడాపెడా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. తన వద్ద ఉన్న సర్వే రిపోర్టులు ఆధారంగా గెలుపు అవకాశాలు లేని సిట్టింగ్ లకు స్థాన చలనం చేయడమో లేక పక్కన పెట్టడమో చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు విడతలుగా నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పులపై జాబితాలను విడుదల చేశారు. ఇప్పటి వరకూ 68 మంది అభ్యర్ధిలను వైసీపీ ప్రకటించింది. 58 అసెంబ్లీ స్థానాలు, పది లోక్ సభ స్థానాలకు వైసీపీ ఇన్ చార్జిలను ప్రకటించింది.
ఇప్పుడు తాజాగా అయిదవ జాబితా విడుదలకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీఎం వైఎస్ జగన్ ఎటువంటి మోహమాటాలను పట్టించుకోవడం లేదు. పార్టీ ముఖ్యనేతల నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగానే ఇన్ చార్జిల మార్పులు చేర్పులు చేస్తున్నారు. తొలి నుండి తన వెంట నడిచిన వారిని సైతం గెలుపు అవకాశాలు లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు. జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న ఈ డేరింగ్ స్టెప్ లు సీనియర్ లను సైతం విస్మయానికి గురి చేస్తుంది. ఇదే క్రమంలో సొంత సామాజికవర్గానికి దెబ్బపడుతోంది. ఈ సారి బీసీలకు వైసీపీ పెద్ద పీట వేస్తొంది. కాగా, రాబోయే జాబితాలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తొంది.
ఈ నియోజకవర్గం వైసీపీకి కంచు కోట అయినప్పటికీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకత ప్రత్యర్ధి పార్టీకి అవకాశం కాకూడదని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్ .. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి అభ్యర్ధిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు దశాబ్దాల నుండి గంగుల, భూమా కుటుంబాల మధ్యనే రాజకీయ వైరం కొనసాగుతోంది. 2012 ఉప ఎన్నికల నుండి ఇక్కడ వైసీపీ అభ్యర్ధులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గంగుల బ్రిజేంద్రరెడ్డి అలియాస్ నాని ఉన్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేయడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. రీసెంట్ గా చంద్రబాబు పర్యటనలోనూ భూమా అఖిలప్రియే ఏర్పాట్లను పర్యవేక్షించారు.
టీడీపీ తరుపున ఈ టికెట్ ఆశిస్తున్న ఏవీ సుబ్బారెడ్డి తదితరులు చంద్రబాబు సమావేశానికి దూరంగా ఉంచారు. దీంతో అఖిలప్రియకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే నాని పట్ల కొంత వ్యతిరేకత కనబడినట్లుగా తెలుస్తొంది. ఈ క్రమంలో అఖిలప్రియకు పోటీగా మరో మహిళా నేతనే దింపితే విజయానికి ఢోకా ఉండదని జగన్ భావిస్తున్నారుట.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే నాని ఇటీవల తన సోదరి అవంతిని సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం కూడా చేశారు. సీఎం జగన్ ఏమి చెప్పారో ఏమో తెలియదు కానీ అవంతి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో గడపగడపకు తిరుగుతున్నారు. అవంతి హైదరాబాద్ నుండి తన మకాం ను ఆళ్లగడ్డ మార్చారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. దీంతో ఆళ్లగడ్డ లో అఖిలప్రియకు పోటీగా వైసీపీ అభ్యర్ధిగా అవంతిని ఖరారు చేస్తారనే మాట వినబడుతోంది.
CM YS Jagan: జగన్ సర్కార్ కు బూస్ట్ .. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించిన బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం