BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. కవిత పేరును చార్జిషీట్లో నిందితురాలిగా చేర్చారు. 41ఏ కింద విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొంది సీబీఐ. ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూప్ నుండి అరెస్టయిన నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితను నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఆమెకు విచారణకు హజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే గతంలో జారీ చేసిన నోటీసులపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐ విచారణకు ఢిల్లీకి వెళ్తారా? లేదా? అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను అధికారులు ప్రశ్నించారు. ఆమె గతంలో వినియోగించిన సెల్ ఫోన్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్ కు వచ్చిన అధికారులు కవితను ఆమె ఇంట్లోనే విచారించారు. ఈడీ అధికారులు మాత్రం రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి.. విచారణ జరిపారు.
అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, ఆమెను నిందితురాలిగా చేర్చడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలను, పలువురు లిక్కర్ వ్యాపార ప్రముఖులను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన నేపథ్యంలో కవితను అరెస్టు చేస్తారంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున ఊహగానాలు వచ్చాయి.
తాజాగా ఈ కేసులో ఆమెను నిందితుల జాబితాలో చేర్చడంతో ఉచ్చు బిగుసుకున్నట్లేననే అని అంటున్నారు. నిందితుల జాబితాలో చేర్చడంతో న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేయాల్సిందేనని, లేకపోతే అరెస్టు తప్పదని అనుకుంటున్నారు. ఈ పరిణామంతో కవిత న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో మనీలాండరింగ్కి సంబంధించి ఏడో సారి నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేజ్రీవాల్కు ఆరుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఒక్క సారి కూడా విచారణకు హాజరుకాలేదు. దీంతో మరో సారి నోటీసులు జారీ చేశారు.