CM YS Jagan: దేశ చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ అందజేస్తున్నామనీ, తద్వారా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా జిల్లా కేంద్రం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకే సారి 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలను శుక్రవారం సీఎం జగన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశామని అన్నారు. ఈ 58 నెలల్లో పేదల బతుకులు మారాలని అడుగులు వేశామని చెప్పారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని అన్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాలను భూసేకరణ ద్వారా సమీకరించి రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్ అందజేసినట్లు సీఎం జగన్ వివరించారు. భూమి కొనుగోలు, జగనన్న టౌన్ షిప్ ల అభివృద్ధికి రూ.210 కోట్లు.. లే అవుట్ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు కేటాయించినట్లు సీఎం జగన్ వివరించారు.
మన ప్రభుత్వంలో పేదలకే పదవులు
గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఉండేవని, మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. పెత్తందారులతో జరిగే ఈ యద్ధంలో ప్రజలు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని విజ్ణప్తి చేశారు. పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చామని అన్నారు.
నాడు నేడుతో విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
నాడు నేడుతో విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తుండటంతో పాటు చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచినట్లు వివరించారు. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తూ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ గతంలో చంద్రబాబు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్యాయమైన స్టేట్ మెంట్ ఇచ్చి, ఎస్సీలంతా గుణపాఠం చెబుతారనే భయం లేకుండా, బాబు రాజకీయంగా బరితెగించి ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.
బీసీల తోకలు కత్తిరిస్తా, ఖబడ్దార్ అని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న విషయం చంద్రబాబు అర్ధం కావడం లేదా అన్నారు. పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా, రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకూగొంకూ లేకుండా ఇప్పటికీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం కంటే దారుణం మరొకటి ఉండదని అన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మొదటి సంతకంతోనే రుణాలుమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలిచ్చి మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజికవర్గానికి అది చేస్తా ఇది చేస్తానని 10 శాతం కూడా అమలు చేయకపోయినా, ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదని తెలిసినా, నిస్సిగ్గుగా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త మేనిఫెస్టో తెచ్చి ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు.
కుప్పంలో ప్రజలు బాబుకి బైబై అంటున్నారు
చంద్రబాబు తన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ గ్రామానికీ ఈ మంచి జరిగిందని సమాధానం చెప్పలేరని సీఎం జగన్ విమర్శించారు. పేదలకు జగన్ మాదిరిగా బటన్ నొక్కాను 2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాను అని ఈ పెద్దమనిషి నోట్లో నుంచి మాటలు రావని అన్నారు. మనం సిద్ధం అంటుంటే.. మరోవంక బాబు భార్య మా అయన సిద్ధంగా లేడు అంటోందని చామత్కరించారు. ఏకంగా కుప్పంలో బైబై బాబు అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తున్నాయని అన్నారు.
ఇలాంటి బాబును ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదని కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించలేదని సీఎం జగన్ విమర్శించారు. ఏనాడూ ఏపీలో లేని వారు, ఏపీకి రాని వారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన వారే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారని అన్నారు. మీ బిడ్డగా అందరితో కోరేది ఒక్కటే. మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడి స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని జగన్ అన్నారు. కాగా, తొలుత ఒంగోలులో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.