ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలో పొలిటికల్ కల్లోలం కనిపిస్తోంది. ఇక్కడ ఈ మూడు పార్టీలు సీట్లు కేటాయించాయే తప్ప ఇంకా సర్దుబాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా కొన్ని సీట్లపై అనేక విమర్శలు వస్తున్నాయి. నేతలు కూడా బహిరంగగానే రోడ్ఉన పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరును మూడు జిల్లాలుగా విభజించారు. ఇందులో తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మద్దాలి గురుమూర్తిని నిలిపింది.
కూటమి నుంచి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వరప్రసాద్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తి గెలుపొందారు. ఇప్పటికే తిరుపతి ఎంపీగా ఉండగా రెండోసారి వైసీపీ నుంచి ఎంపీ కావాలని కోరుకుంటున్నారు. వరప్రసాద్రావు తిరుపతి ఎంపీగా, గూడూరు ఎమ్మెల్యేగా వైసీపీలో పని చేశారు. అక్కడ సీటు లభించకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరారు. అనూహ్యంగా ఆయన పేరు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
చిత్తూరు జిల్లాకు సంబంధించి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రెడ్డప్ప రెండోసారి పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి టీడీపీ తరపున దగ్గుమళ్ల ప్రసాద్రావు పోటీలో ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట నుంచి సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, సీట్లు పంపకాలు జరిగినంత ఈజీగా సర్దుబాట్లు జరగడం లేదన్నది కూటమి నేతలు చెబుతున్న మాట.
ప్రస్తుతం జరిగిన సీట్ల పంపకాలపై మూడు పార్టీల నాయకులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. తమను కాదని ఇతరులకు సీటు ఇవ్వడం.. వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయించడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టిన వారికి తిరిగి పని చేయాలంటే ఎలా చేస్తామంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో కూటమి అభ్యర్థులు ఎలా అందరిని కలుపుకొని ముందుకు వెళ్తారు అనేది ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
పార్టీ అధినాయకత్వం బుజ్జగిస్తున్నా… భయపెడుతున్నా దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బయటకు సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తున్న కొందరు నేతలు తెరవెనుక రాజకీయాలను ముమ్మరం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నాయకుడు ఆరణి శ్రీనివాసులకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు ఒక్కటయ్యారు. ఇలా కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. మరి కూటమి పార్టీలు మాత్రం అంతా బాగుందని అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.