ఏపీలో కాంగ్రెస్ను తిరిగి నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీకి ఆశావహ అభ్యర్థులు క్యూ కడుతు న్నారు. సీఎం జగన్ సోదరి షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్పై నమ్మకం ఏర్పడిందో లేక.. ఏదో ఒక పార్టీ ఉంది కదా.. పోటీ చేస్తే పోలా అని అనుకుంటున్నారో.. తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీకి నాయకులు పెరిగారు.
సత్యసాయి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశవాహులు అధికమయ్యారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా హిందూపురం అర్బన్, మడకశిర, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలు సత్యసాయి జిల్లాలోకి వస్తాయి. హిందూపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు చేసుకోగా అత్యధికంగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ఒక్క హిందూపురం లోకసభ స్థానానికే కాంగ్రెస్ పార్టీకి మూడు దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి సంబంధించి హిందూపురం నుంచి ఇనై తుల్లా ఆయన కొడుకు సహా మరికొంతమంది దరఖాస్తు చేశారు. వాస్తవానికి వైఎస్ షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. పార్టీ టికెట్ల కోసం ఆశావాహులు అధికంగానే పోటీపడుతున్నారని, ఇది అందుకు నిదర్శనమని సీనియర్లు చెబుతున్నారు.
మడకశిర పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను ప్రకటించిన విషయం తెలిసింది. పెనుగొండలో శ్రీనివాస్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు సమాచారం. పుట్టపర్తి నుంచి పులివెందుల లక్ష్మీనారాయణ తన కోడలు భరణికి ఇవ్వాలని వైఎస్ షర్మిలకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష్మీనారాయణ తన అనుచరులతో టికెట్ తమకే వస్తుందని చెప్పడం జరిగింది. ఎలక్షన్లో తనకు మద్దతుగా అందరూ సహకరించాలని కోరుతూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరితోపాటు వివిధ పార్టీల్లో టికెట్ రాని అసంతృప్తులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో సత్యసాయి జిల్లాలో కాంగ్రెస్ కు లెక్కకు మించిన సంఖ్యలో అభ్యర్థులు రావడం గమనార్హం. మరి ఎవరికి టికెట్ ఇస్తారనేది చూడాలి.