అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వ తీరుపై లోకేష్ మండిపడ్డారు.
గతంలో కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయమిచ్చే సంప్రదాయం ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, ప్రజల ఇబ్బంది చూస్తుంటే అంత సమయం సరికాదనే భావన కలుగుతోందని లోకేష్ పేర్కొన్నారు. కేవలం నెల రోజుల్లోనే ఆరుగురు టిడిపి కార్యకర్తలు హత్యకు గురయ్యారని లోకేష్ అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఇప్పటి నుండే ప్రభుత్వంపై పోరాటం చేయకతప్పదని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలను మాత్రమే అమలు చేస్తామంటున్నారనీ, పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల సంగతేమిటనీ లోకేష్ ప్రశ్నించారు.
ఐటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుండి తిరుగుముఖం పడుతున్నాయనీ, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్ సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయనీ లోకేష్ అన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు చేరువ అయ్యే సమయం లేకపోవడం వల్లనే ఓటమి సంభవించిందని లోకేష్ అభిప్రాయపడ్డారు.
సమావేశంలో కళా వెంకట్రావు, దేవినేని ఉమా, పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు.