పార్టీపై విధేయతకు కానుక.., మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోతున్న వారికి న్యాయ నిర్ణయం.., దేశ కుబేరుడి దౌత్య ఫలితం… ఈ మూడు అంశాలు కలిసి వైసీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపాయి. అందుకే ముందు నుండే ఊహించిన పేర్లే దాదాపు ఖరారయ్యాయి. “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పినట్టు అయోధ్యరామిరెడ్డికి, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభకు పంపనున్నారు. అయితే నాలుగో అభ్యర్థిగా నత్వాని ఆకస్మికంగా తెరపైకి వచ్చారు. రీలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీడగా ఉంటున్న నత్వానికి రాజ్యసభ ఇవ్వాలంటూ గతవారమే చర్చలు జరిగాయి. ముకేసుడు, జగన్ ని కలిసి విషయం చెవిన వేశారు. జగన్ తాజాగా ఖరారు చేశారు.
నత్వానీకి ఇవ్వడం దేనికి సంకేతం…!
పరిమల్ నత్వానీ తెలుగోడు కాదు. వైసీపీకి అసలు తెలియని మొఖం. జగన్ కి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బీదా మస్తానయ్య, ఇంకా పెద్దలను కాదని జగన్ నత్వానికి రాజ్యసభని ఖరారు చేశారు. దీని వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. ముఖేష్ ఏమి సాధారణ పనిమీద వచ్చి జగన్ ని కలవలేదు. నత్వాని ఏమి సాధారణ వ్యక్తి కాదు. దేశంలోనే అతి పెద్ద కార్పొరేట్ వ్యవస్థ రిలయన్స్ లో నత్వానీ కీలక స్థానంలో ఉన్నారు. ముఖేష్ తండ్రి ధీరుభాయి అంబానీ నుండి రిలయన్స్ లో ఆయన స్థానం నంబర్ 2. కార్పొరేట్ వ్యవహారాలు చూస్తుంటారు. మంచి మాటకారి, వ్యాపార చాణక్యత, రాజకీయ చాణక్యత ఉన్నాయి. ముఖేష్ కి, కేంద్రానికి మధ్య సమన్వయం బాధ్యతలు మోసేది ఈయనే. 2008లో జార్ఖండ్ నుండి మొదటిసారి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించారు. రెండో సారి కూడా అక్కడి నుండి ఎన్నికయ్యారు. కేంద్రంలో అందరికీ సుపరిచితులు. అమిత్ షా, మోడీ వంటి బిజెపి పెద్దలకు మానస ప్రియుడు. అందుకే ఆయన ఎలాగైనా రాజ్యసభలో ఉండాలి. ఉండాలంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు ఖాళీ ఉన్నాయో చూసి…, ఏపిలో నాలుగు స్థానాలు ఖాళీ అవ్వడంతో ఇక్కడి నుండి ఆశించారు. ఆశించినదే తడవుగా కృత్యాలు ఒకటికొకటి జరిగిపోయాయి.
- ఢిల్లీలో ఎన్నికలు ముగిసిన వెంటనే జగన్ వెళ్లి అమిత్ షా, మోడీలను కలిశారు. అప్పటి వరకు రెండు, మూడు సార్లు వెళ్లి అపాయింట్మెంట్ లేక తిరిగి వచ్చిన ఆయన.., మళ్ళీ ఆఘమేఘాల మీద వెళ్లి కలిసి వచ్చారు.
- ఇది జరిగిన వారానికి అంబానీ, నత్వానిని వెంటేసుకుని వచ్చి జగన్ ని కలిశారు. నత్వానికి ఇవ్వాలని అడిగారు.
- బిజెపీ ఆదేశాలో, అమిత్ షా మాటలో.., కేంద్రంతో సౌఖ్యత కోసమో.., అంబానీతో బంధం కోసమో జగన్ ఇచ్చేసారు. కాదనలేక నత్వానికి రాజ్యసభని దాదాపు ఖరారు చేసేసారు.
మరి వైసీపీలో పెద్దల పరిస్థితి..??
వైసీపీలో పెద్దలు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. నెల్లూరు ఎంపీ సీటు త్యాగం చేసిన మేకపాటి. ఒంగోలు ఎంపీ సీటు త్యాగం చేసిన వైవి సుబ్బారెడ్డి.., స్పష్టమైన హామీతో పార్టీలో చేరిన బీదా మస్తానయ్యతో పాటూ మండలిలో సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి, జగన్ సోదరి షర్మిల, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వంటి వారి పరిస్థితి ఇప్పుడు ఆశల సుడిలో ఉంది. వైవీ ప్రస్తుతం టిటిడి ఛైర్మన్ గా ఉన్నారు. ఈ ఏడాది జూన్ తో ఏడాది పూర్తవుతుంది. ఆయన్నే కొనసాగిస్తారో.., వేరొకరికి అవకాశం ఇస్తారో స్పష్టత లేదు. అందుకే వైసీపీలో పెద్దలకు ప్రస్తుతం అవకాశాలు లేనట్లే. అయితే త్వరలోనే అవకాశాలు రానున్నాయి. వచ్చే ఏడాది నాటికి మరో మూడు ఖాళీలు ఏర్పడతాయి. అలా 2024 నాటికి వైసీపీ నుండి 12 మందికి రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. సో… సీనియర్లు తొందర, ఆందోళన వద్దు అనేది జగన్ ఆలోచన.