అమరావతి, జనవరి 18: ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నందిగామ శివారు అనాసాగరంలో శుక్రవారం పిడతల సత్యంబాబును, అతని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు. వారి వద్ద నుండి రాతపూర్వకంగా స్టేట్మెంట్లు తీసుకున్నారు.
ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని ట్రయిల్ కోర్టులో దోషిగా తేలి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన పిడతల సత్యంబాబు ఇటీవల హైకోర్టు ఉత్తర్వులతో నిర్దోషిగా విడుదల అయ్యారు.
అయేషా మీరా హత్యకు గురైన ఇబ్రహీంపట్నంలోని దుర్గా హస్టల్ నిర్వహకులను కూడా సిబిఐ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తుంది.
సిట్ విచారణ సక్రమంగా జరగలేదనీ, అసలు దోషులను వదిలివేసి, చిల్లర నేరాలకు పాల్పడే సత్యంబాబును కేసులో ఇరికించారని ఆయేషా మీరా తల్లిదండ్రులు పలు సందర్భాల్లో ఆరోపించారు. అసలైన దోషులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని వారు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ కేసులో పలు ఆధారాలు మాయం చేసిన కోర్టు సిబ్బందిపై ఇప్పటికే సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు.