AP Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్, బాధితులకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఈ తరుణంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఏపి కేబినెట్ భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనున్నది.
ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో ముందుగా ఈ రోజు ఏపి కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఆక్సిజన్ సమస్య, రెమ్ డెసివిర్ ఇంజక్షన్, వ్యాక్సినేషన్, మినీ లాక్ డౌన్ పై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు తదితర కీలక అంశాలపై కమిటీ చర్చించనున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సూచనలపై ఈ సమావేశంలో చర్చించి సబ్ కమిటీ నివేదికను సీఎం జగన్ కు అందజేసే అవకాశం ఉంది. ఈ నివేదిక అధారంగా రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం, ఆసుపత్రుల్లో సదుపాయాలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన కఠిన చర్యలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.