క్రిస్మస్ గీతాలు, ప్రార్ధనలు, బైబిల్ పఠనాలు, సందేశాలతో చర్చిలు అన్నీ సందడిగా మారాయి. చర్చిల్లో శనివారం అర్ధరాత్రి నుండి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రార్దనా మందిరాలను అలంకరించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆదివారం క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చిలు అన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పులివెందుల సి ఎస్ ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం జగన్, వైఎస్ విజయమ్మ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో నూతన సంవత్సర క్యాలెండర్ లను సీఎం జగన్ ఆవిష్కరించారు.
AP CM YS Jagan attends christmas celebrations CSI church Pulivendula
ఈ సారి విశేషం ఏమిటంటే పులివెందులల్లో క్రిస్మస్ వేడుకలకు వైఎస్ షర్మిల దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ షర్మిల తమ స్వగ్రామంలో గల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేవారు. అయితే ఈ ఏడాది వేడుకల్లో పాల్గొనలేదు. వైఎస్ షర్మిల ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లిన కారణంగా పులివెందుల్లో క్రిస్మస్ వేడుకలకు హజరు కాలేకపోయారని సమాచారం.
క్రిస్మస్ పండుగ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, ప్రేమ, ధాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.