గ్రామ, వార్డు సచివాలయ విభాగాల విషయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేర్చేందుకు గానూ జగన్మోహనరెడ్డి సర్కార్ మొట్టమొదటి సారిగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా వివిధ రకాల సేవలకు ఇంతకు ముందు మాదిరిగా మండల కేంద్రాలకు ప్రజలు వెళ్లాల్సిన పని లేకుండానే పనులకు పూర్తి చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలను తన కేబినెట్ లో ఇద్దరు మంత్రులకు అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేశారు సీఎం జగన్. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆదిమూలపు సురేష్ కు పట్టణాల్లోని వార్డు సచివాలయాల బాధ్యతలను అప్పగించిన సీఎం జగన్..గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడుకి గ్రామాల్లోని సచివాలయాల బాధ్యతలను అప్పగించారు.