AP CM YS Jagan: రాష్ట్రంలో నూతన విద్యా విధానం తీసుకువస్తే అంగన్ వాడీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని అందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ వర్గాలకు భరోసా ఇచ్చారు. స్కూళ్లు, అంగన్ వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క కేంద్రం కూడా మూసివేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల మేలు కోసమే నూతన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని, ఇదే విషయాన్ని తెలియజెప్పాలని జగన్ అధికారులకు సూచించారు.
విద్యాశాఖ, అంగన్ వాడీల్లో నాడు – నేడు పై సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష జరిపి దీని అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందనీ, ఇప్పటి వారిక కాకుండా తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. నూతన విద్యావిధానంపై అపోహాలను తొలగించి జరిగే మేలును గురించి వివరించాలని సూచించారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కళాశాలలు ఉండాలని స్పష్టం చేసిన జగన్ ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు – నేడు కింద భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా వచ్చే ఏడాది నుండి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
Read More: Ashok Gajapati Raju: విజయసాయి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పిన అశోక్ గజపతిరాజు..!!
రాష్ట్రంలో రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పిపి -1 లో 1,2 తరగతులకు కిలో మీటరు లోపు పాఠశాల ఉండాలన్నారు. పిపి -2 లో 3 -10 తరగతులకు మూడు కిలో మీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాలు బోదించే విధానం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. జూలై 1 నుండి రెండో దశ నాడు – నేడు ప్రారంభించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఐసీడీఎస్ లక్ష్యానికి విరుద్ధంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందనీ, దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ ఆయాలు, వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం జగన్ నేడు క్లారిటీ ఇచ్చారు.