Ashok Gajapati Raju: ఏపి హైకోర్టు తీర్పుతో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మళ్లీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేసిన అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు. మాన్సాస్ లో ఆడిట్ జరగలేదంటే తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ఆడిటింగ్ కోసం ప్రతి సంవత్సరం సంస్థ ఫీజు కూడా అదికారికంగా చెల్లించిందన్నారు. ట్రస్ట్ కార్యాలయం విజయనగరం నుండి ఎందుకు తరలిస్తున్నారో తెలియట్లేదని అన్నారు.
Read More: Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ ను వైసీపీ ఇక వదిలేసిందా..?కరోనా బ్రేక్ ఇచ్చిందా..!?
రామతీర్థం విగ్రహాన్ని పునః ప్రతిష్టించినప్పుడు ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదనీ, అయినప్పటికీ తాను ఆలయానికి విరాళం పంపితే తిరస్కరించడం పట్ల మనస్తాపం కల్గిందన్నారు. దాంతో ఆ విరాళాన్ని ఆయోధ్య రామాలయానికి ఇచ్చానని తెలిపారు అశోక్ గజపతిరాజు. దోపిడీదారులు మాన్సాస్ లో స్థానం లేదని పేర్కొన్నారు. మాన్సాస్ చైర్మన్ గా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అదే విధంగా విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని అశోక్ గజపతిరాజు చెప్పారు.
తన బాధ్యతల స్వీకరణ సందర్భంలో ఇఓ, కరస్పాండెంట్ గైర్హజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయ ఇఓ కూడా తనను కలవడానికి ఇష్టపడటం లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలన్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిన్న అశోక్ గజపతిరాజుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలకు కౌంటర్ గా అశోక్ గజపతిరాజు నేడు మీడియాతో మాట్లాడారు.