Neelam Sahni: నీలం సాహ్ని Neelam Sahni ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమె పదవీ విరమణ కాలాన్ని కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేసి రెండుసార్లు పొడిగించారు. మొత్తంగా ఆమె పదవీ విరమణ అనంతరం.. సీఎం జగన్ ఆమె సేవలను మళ్లీ ఉపయోగించుకోవాలని భావించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. ఆమె ఆ పదవిలోకి వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడమే కాదు.. తీవ్ర వ్యాఖ్యలు చేసి నోటిఫికేషన్ ను కొట్టేసింది. ఈ అంశం రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే.. ఇప్పుడు ఆమె ఎన్నికే తప్పు అంటూ హైకోర్టులో పిల్ దాఖలవడం సంచలనం రేపుతోంది.
ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ జి. రామకృష్ణ పేరుతో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురి పేర్లతో ప్రభుత్వం తయారు చేసిన ప్యానెల్ కూడా రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలు అందించేందుకు కొంత గడువివ్వాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు లేకుండా పిల్ ఎందుకు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ వేయడం ఆషామాషీ అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది.
Read More: Mp: ‘ఎంపీ’లో టెన్షన్ మొదలైందా..? స్పీకర్ ని కలిసింది అందుకేనా..?
మొత్తానికి న్యాయవాది అభ్యర్ధనతో వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే.. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చదవకుండా నోటిఫికేషన్ ఇచ్చారా? సీఎస్ గా చేసిన వ్యక్తికి ఇంగ్లీషు చదవడం వచ్చే ఉంటుంది కదా? అంటూ గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే సంచలనం రేపాయి. ఇప్పుడు ఆమె నియామకంపైనే ఓ పిటిషన్ దాఖలైంది. విజయవంతమైన సీఎస్ గా.. గౌరవప్రదంగా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నికి ఇవన్నీ వ్యక్తిగతంగా బాధించేవే. మరోవైపు.. ఎన్నికల కమిషనర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలతో ప్రభుత్వ పెద్దల మాటలు వినడంలేదనే వార్తలూ లేకపోలేదు. ఈనేపథ్యంలో ఆమెపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.