AP High Court: ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు న్యాయ సమీక్షలో నిలబడలేకపోతున్నాయి. తాజాగా మరో కీలక ప్రాజెక్టు విషయంలోనూ ఏపి హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఏపి ప్రభుత్వం చేపట్టనున్న మెగా సోలార్ ప్రాజెక్టు టెండర్లను ఏపి హైకోర్టు రద్దు చేసింది. తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సైతం తాజాగా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది.
పవర్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఉందని టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపి విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి పరిధి హక్కులను పీపీఏ తొలగించడం చట్ట విరుద్ధమని టాటా ఎనర్జీ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేందుకు వీలు ఉంటుందని పేర్కొనడం టెండర్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని టాటా ఎనర్జీ పేర్కొంది. ప్రభుత్వ తరపు న్యాయవాది రైతాంగ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోందని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం టెండర్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
రెండు రోజుల క్రితమే మాన్సాస్, సింహాచలం దేవస్థానాల ట్రస్ట్ నియామక ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా గత నెలలో సంఘం డెయిరీ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అంతకు ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇలా వరుసగా హైకోర్టులో ఏపి ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. వీటిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.