TRS: టీఆర్ఎస్ కూడా రాజకీయ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోబోతున్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది.వరుసగా రెండుసార్లు అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి మునుపటి అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు.నిజానికి ఏ పార్టీ అయినా పదేళ్లపాటు అధికారంలో ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందన్నది వాస్తవమే.టీఆర్ఎస్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు.వరస పెట్టి దుబ్బాక మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచినప్పటికీ,ఇందుకు ఆ పార్టీ సర్వశక్తులూ ధారపోయాల్సి వచ్చింది.ఉప ఎన్నికలంటే ఆ వ్యవహారం వేరు.కానీ సాధారణ ఎన్నికలంటే సీన్ వేరుగా ఉంటుంది.
కాంగ్రెస్ ,బీజేపీతోపాటు షర్మిల పార్టీ కూడా పోటీయే!
తాజాగా తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి.కాంగ్రెస్ కి తెలంగాణలో స్వతహాగానే బలం ఉంది.బిజెపి నిలదొక్కుకోవాలని చూస్తోంది. ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్ను బలంగా ఢీ కొట్టే శక్తిసామర్థ్యాలను అందుకుంటోన్నాయి. ఇదే క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైెఎస్ షర్మిల సైతం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోండటం రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తోంది.షర్మిల పార్టీ వల్ల తెలంగాణలో అత్యంత బలంగా ఉండే ఒక సామాజికవర్గం తప్పనిసరిగా ఆమె వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్కు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని చెప్పాలి. వీటన్నింటినీ అధిగమించి- 2023లో అధికారంలోకి రావడానికి గులాబీదళం శక్తికి మంచి చెమటోడ్చక తప్పకపోవచ్చు.
పీకే అయితే ఓకే !
దీన్ని ముందే గ్రహించినట్టుంది టీఆర్ఎస్ అధిష్ఠానం. అందుకే- దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలను పాటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయక సహకారాలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం. ఏపీలో బలమైన తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టి- ఏకంగా 151 స్థానాలను గెలచుకుంది వైఎస్సార్సీపీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీని వెనుక ప్రశాంత్ కిషోర్..ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ ఉందనేది బహిరంగ రహస్యమే.ఇక ప్రశాంత్ కిషోర్ కూడా బిజెపియేతర పార్టీలకు సాయం చేయటానికి ముందుంటున్నారు.కాబట్టి టీఆర్ఎస్ కి కూడా ఆయన స్నేహ హస్తం అందించే అవకాశాలు లేకపోలేదు.ఇంతకు ముందే ఒకసారి పీకేతో కేటీఆర్ భేటీ అయినట్లు కూడా టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రాగలదు.