AP High Court: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ నెల 29 నుండి బెయిల్ కు అంతకు ముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.
29వ తేదీ నుండి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హజరుకావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
మరో పక్క స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, గతంలోనే వాదనలు పూర్తి అయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. త్వరలో సుప్రీం ధర్మాసనం రేపో, మారో తీర్పు ప్రకటించనున్నది.
కాగా స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలోఉన్నారు. అయితే అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు గత నెలలో నెల రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఇటీవల స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ పిటిషన్ పై హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిర్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలతో ఏకీభవించిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది.