Visakha: విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బోటులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బోట్లకు అంటుకోవడంతో మొత్తం 40 కిపైగా బోట్లు కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మెరైన్ బోర్టల ద్వారా మంటలను అదుపు చేశారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకున్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బోట్లు కాలిపోవడంతో యజమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సిదిరి అప్పలరాజును తక్షణం ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

కాగా, ఈ ఘటనపై పోలీసులకు కీలక సమాచారం అందింది. ఓ యూట్యూబర్ ఫిషింగ్ హార్బర్ లో మందు పార్టీ ఏర్పాటు చేశారనీ, పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Vijayasanthi: విమర్శకులకు విజయశాంతి ఇచ్చిన సమాధానం ఇదే