AP SEC: ఏపిలో బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ రెండు క్రితం జరిగిన సంగతి తెలిసిందే. రేపు కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల కాక తగ్గకమునుపే రాష్ట్రంలో మరో ఎన్నికల నగరా మోగింది. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నేడు షెడ్యుల్ విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. 15వ తేదీ పోలింగ్, 17వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.,
AP SEC: 13 మున్సిపాలిటీల్లో 15 న పోలింగ్
నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా లోని గురజాల, దాచేపల్లి, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచెర్ల, వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో 15వ తేదీ పోలింగ్ జరగనున్నది. అదే విధంగా 498 పంచాయతీల్లో 69 సర్పంచులకు ఈ నెల 14న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీ లకు ఈ నెల 16న పోలింగ్ నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి 18న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది.
29న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
మరో పక్క ఏపి, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది. ఏపిలో మూడు, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. ఈ నెల 9న వీటికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఏపిలో మే 31 ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది ఈసీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది. ఏపి అసెంబ్లీలో వైసీపీకి, తెలంగాణ అసెంబ్లీ లో టీఆర్ఎస్ కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్ధుల ఎన్నిక లాంఛన ప్రాయమే అవ్వనుంది.