AP Village Secretariats: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ రాష్ట్రంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటిండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేసింది. సచివాలయ ఉద్యోగులు విధిగా ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో కశ్చితంగా బయోమెట్రిక్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా మరో కీలక ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండు దశల్లో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితేనే ప్రొబేషన్ పూర్తి అయినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తి అవుతుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ముందుగా రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ గా పేర్కొంది. రెండేళ్లు పూర్తి అయిన వెంటనే పేస్కే ల్ తో వారిని పర్మినెంట్ ఉద్యోగులు అవుతారని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రెండేళ్లు పూర్తి అయిన వెంటనే వారికి పేస్కేల్, డీఏ, హెచ్ఆర్ఏ తదితర అలవెన్స్ తో జీతం పెరుగుతుంది. త్వరలో తమ ప్రొబిషన్ పూర్తి అవుతుంది జీతాలు పెరుగుతాయని ఆశ పడుతున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆశలకు నీళ్లు చల్లేలా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రొబేషన్ పూర్తి చేసుకున్న వారు రెండు పరీక్షల్లో (డిపార్ట్మెంటల్ టెస్ట్స్) పాస్ అయితేనే వారికి పే స్కేల్ ఫిక్స్ అవుతుంది. ప్రభుత్వ పథకాలు, శాఖాపరమైన అంశాలు, డిజిటల్ సేవలు వంటి వాటిపైనే ప్రశ్నలు ఉంటాయని తెలిపింది. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. అన్ని పరీక్షలను ఆన్ లైన్ ద్వారా ఏపిపిఎస్సీ నిర్వహించనున్నది. ఏపిలో ప్రస్తుతం 1.34 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం గతంలో వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ ప్రభుత్వ సేవలు గ్రామాల్లోనే పొందుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఆయా సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.