Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యుల్ ను ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యుల్ ప్రకారం నేడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. రిటర్నింగ్ అధకారి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ, టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ లను ఆయా పార్టీలు ప్రకటించారు. కాగా శుక్రవారం తొలి నామినేషన్ దాఖలైంది. నవతరం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బద్వేల్ తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను గోదా రమేష్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం పాల్గొన్నారు. తొలుత కడప నవతరం పార్టీ కార్యాలయంలో గోదా రమేష్ కుమార్ కు పార్టీ బిఫారంను పార్టీ అడ్ హక్ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా అందజేశారు.
Badvel By Poll: తప్పనిసరి పరిస్థితుల్లోనే నవతరం పోటీ
ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన బద్వేల్ లో ముందుగా నేతలతో సంప్రదింపులు జరిపిన తరువాతే గోదా రమేష్ కుమార్ ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి బాధాకరమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకతప్పలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలను అధికార వైసీపీ ముందుగా సానుభూతి కోణంలో ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరి ఉండాల్సిందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ముందుగా ఆ ప్రతిపాదన రాకపోవడం వారి తప్పిదమనేనన్నారు. దళిత బహుజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గోదా రమేష్ కుమార్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారనీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారని తెలిపారు. నవతరం పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. నవతరం పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో పాటు పలు అంశాలపై గోదా రమేష్ పోరాడారని ఆయన తెలిపారు.
Badvel By Poll: 8వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ
కాగా నేటి నుండి ఈ నెల 8వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13వరకూ గడువు ఉంది. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగుతుంది. కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ పేర్కొన్నారు. రోడ్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.