Chandra babu: రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన పై మిశ్రమ స్పందన వస్తోంది. పలు ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా తమ ప్రాంతాలకు అన్యాయం జరిగిందంటూ ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదిన జిల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినప్పటికీ పలు జిల్లాల్లో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించకుండా వేరే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించడంతో ఆ ప్రాంతాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Chandra babu: అభినందన ర్యాలీలు, నిరసనలు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపే ఇబ్బందికర పరిస్థితి ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లాల విభజన ఏమిటన్న వాదన కూడా వినబడుతోంది. రేపు ఉగాది నుండి కొత్తగా ఏర్పాటు కానున్న 13 జిల్లాల్లో జిల్లా కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు, అద్దెలు చెల్లింపు, జిల్లా అధికారుల వేతనాల చెల్లింపు ప్రభుత్వ ఖజానాకు మరి కొంత భారం కానున్నది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో అభినందన ర్యాలీలు నిర్వహించారు. జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ లబ్దికోసం కాకుండా ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా చేయాలని అన్నారు.
ఎన్టీఆర్ పేరుతో ఉన్న 14 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది
ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల పునర్విభజన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు చంద్రబాబు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టడంపై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరుతో ఉన్న 14 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఎన్టీఆర్ పై గౌరవం ఉన్నట్లు ఆయన పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.