AP Fiber Net Scam: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్ పలు విచారణలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపి ఫైబర్ నెట్ లిమిటెడ్ లో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్దమైంది. ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి నివేదిక ఆధారంగా సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కోరింది. అయితే విచారణ చేపట్టే అంశంపై సీబీఐ నుండి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. సుమారు 700 నుండి వెయ్యి కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టు లో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లతో పాటు ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమలు జరిగాయన్నది ప్రధాన అభియోగంగా ఉంది.
గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా వ్యవహరించిందని విమర్శలు వచ్చాయి. నకిలీ పత్రాలతో ఫైబర్ నెట్ లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని వైసీపీ గతంలోనే ఆరోపణలు చేసింది. అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మీద గతం నుండి వైసీపీ ఆరోపణలు గుప్పిస్తొంది. ఈ ఆరోపణలలో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిని ప్రభుత్వం సీఐడికి అప్పగించింది. నారా లోకేష్ ను బుక్ చేసే అధారాలు లభిస్తాయా లేదా అనేది త్వరలో తేలనున్నది.