విజయవాడలో వంద కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కోర్టు భవనాలను సీఎం వైఎస్ జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు. పదేళ్ల క్రితం రూ.58 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసిన ఈ భవన నిర్మాణ వ్యయం వంద కోట్లకు మించిపోయిందన్నారు. తాను శంకుస్థాపన చేసిన భవనానికి తానే ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రకరకాల కారణాలతో ఈ నిర్మాణం ఆలస్యమైందన్నారు. భవన నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాయన్నారు. అదే విధంగా విశాఖలోనూ కోర్టు భవన నిర్మాణాలను పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకరించాలని కోరారు.
సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలి
కోర్టు భవనాల నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ బాధ్యతలను కేంద్రం తీసుకోవాలని తాము సూచించగా వ్యతిరేకత వచ్చిందనీ, ఆ సమయంలో తమ ప్రతిపాదనకు మద్దతుగా ఏపి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు మద్దతుగా నిలిచారనీ, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు. పెండింగ్ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలన్న తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలని సీజేఐ జస్టిస్ వెంకట రమణ అన్నారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్ లను ప్రోత్సహించాలని సూచించారు. విభజన అనంతరం ఏపి ఆర్ధికంగా వెనుకబడిందనీ, విభజనతో నష్టపోయామన్న భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు. సమాజం శాంతియుతంగా ఐక్యమత్యంతో ఉంటే అబివృద్ధి చెందుతుందన్నారు. అందరూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. తాను రెండు రాష్ట్రాల్లో జడ్జిల ఖాళీలను భర్తీ చేసినట్లు చెప్పారు. తాను సీజేఐ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 250 మంది హైకోర్టు జడ్జిలను, 11 మంది సుప్రీం కోర్టు జడ్జిలను నియమించడం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఏపి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. 2013లో జస్టిస్ వెంకట రమణ చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్ కు శుంకుస్థాపన జరిగిందనీ, ఇప్పుడు మళ్లీ ాయన చేతుల మీదుగానే ప్రారంభం కావడం విశేషమనీ, ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టమని అన్నారు.