CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు అవసరమైన అనేక సేవలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలు పొందుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాల సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా రైతాంగం కోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను (ఆర్బికే) ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు తొలి దశ కింద ఇప్పటికే 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించగా, రెండో దశలో మరో 613 చోట్ల ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
CM YS Jagan: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏటీఎం సేవలు
ఇప్పుడు తాజాగా గ్రామ సచివాలయాల్లో ఏటీఎం సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాల (ఆర్బికే) కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న చోట్ల తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక గ్రామ సచివాలయంలో ఏటీఎం సేవలను ఏర్పాటు చేయనున్నామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. తొలి దశలో ఉగాది నాటికి జిల్లాకు ఒక సచివాలయంలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానున్న ప్రభుత్వం రెండో దశలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కువగా కార్యకలాపాలు సాగే ఒక సచివాలయంలో, మూడో దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అధికంగా జరిగే ఒక గ్రామ సచివాలయంలో ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలు చేపట్టింది.