AP Budget: రాష్ట్ర ఆర్థిక రంగంపై కోవిడ్ ప్రభావం పడినప్పటికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం యథాతధంగా కొనసాగిస్తున్నదని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కోవిడ్ మృతులకు సంతాపం తెలిపిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశంలో కోవిడ్ సంక్షోభం కొనసాగుతోందనీ, ఈ పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలుసునన్నారు. సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ఆయన ప్రశంసించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95 శాతం హామీలు పూర్తి శామన్నారు. ప్రస్తుత సంక్షేమ సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చామన్నారు. నవరత్న పథకాల ద్వారా లబ్దిదారులకు నేరుగా సాయం అందుతోందన్నారు. నాడు – నేడు, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. జాతీయ గీతాలాపనతో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అనంతరం సభా వ్యవహారాల కమిటీ సమావేశం అయ్యింది. తదుపరి గవర్నర్ ప్రసంగంపై ధన్యావద తీర్మానంపై సభలో చర్చించనున్నారు. 11 గంటల తరువాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.2.30లక్షల కోట్లతో 2021-22 రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదించి మండలికి పంపించనున్నారు.