ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహాం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో శనివారం ఉదయానికి 4,13,126 క్యూసెక్కులుగా ఉంది. ఇక బ్యారెజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ను అధికారులు జారీ చేశారు. ముంపు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా నదీ పరివాహనక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో కృష్ణాకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక నాగార్జున సాగర్ వద్ద 4.03 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. వీకెంట్ కావడంతో నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారెజ్ ల వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని కృష్ణానది పరవళ్లు తిలకిస్తున్నారు. సాగర్ వద్ద 26 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.