Kesineni Sweta: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను మేయర్ కు అందజేశారు. కౌన్సిల్ లో పెట్టి తన రాజీనామా ఆమోదించాలని మేయర్ ను కోరారు. అనంతరం మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ 11 డివిజన్ కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకీ రాజీనామా చేస్తానని వెల్లడించారు. తాము ఎప్పుడూ పార్టీ వీడాలని అనుకోలేదన్నారు. తమను టీడీపీయే వద్దని అనుకున్నప్పుడు తాము కొనసాగడం కరెక్టు కాదని పేర్కొన్నారు. రాజీనామా తర్వాతా తన తండ్రి కేశినేని నాని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.
గౌరవం లేని చోట తాము పని చేయలేమని స్పష్టం చేశారు. తన తండ్రి, తాను ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. గత ఏడాది కాలంగా పార్టీలో తన తండ్రి అనేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు. జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ పార్టీ అధిష్టానంకు తెలియదనే భ్రమలో ఉన్నామని అన్నారు. కార్పోరేషన్ ఎన్నికల సమయంలో విజయవాడలో ముగ్గురు నాయకులు తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. పార్టీ నుండి తమతో వచ్చి వారికి కఛ్చితంగా అండగా ఉంటామని తెలిపారు.
తిరువూరు సభకు కేశినేని నానికి ఏమిటి సంబంధం అని లోకేష్ అనడాన్ని శ్వేత తప్పుబట్టారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడికి ఏమిటి సంబంధం అని అడగడం లోకేష్ తెలివితేటలకు నిదర్శనమని అన్నారు. కేశినేని నాని మూడో సారి కూడా విజయవాడ నుండే పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
తిరువూరు ఘటన నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పదవికి, పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని మీడియాకు తెలిపారు. విజయవాడ నుండే మూడో సారి లోక్ సభకు పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.