YSRCP: కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ వైసీపీ టికెట్ తనదేనంటూ తండ్రీ తనయులు ఇద్దరూ ప్రకటించుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి పినిపె విశ్వరూప్, ఆయన కుమారుడు శ్రీకాంత్ మద్య టికెట్ వార్ నడుస్తొంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇన్ చార్జిలు, సిట్టింగ్ ల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. అమలాపురం ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత పినిపే విశ్వరూప్ ప్రస్తుతం జగన్ కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ చార్జిను మార్చనున్నట్లుగా తెలిపారు. అక్కడి నుండి సైలెంట్ గా వచ్చేసిన విశ్వరూప్ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ తరుణంలోనే విశ్వరూప్ కు బదులుగా ఆయన తనయుడు శ్రీకాంత్ కు టికెట్ ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. తనకే ఇన్ చార్జి బాధ్యతలు ఇచ్చారంటూ విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ప్రచారం చేసుకుంటున్నారు. అమలాపురంలో ఫ్లెక్సీలు, బ్యానర్ లు కూడా ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు.
పార్టీ అధిష్టానం నుండి అధికారికంగా ప్రకటన రాకముందే శ్రీకాంత్ ప్రచారం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉన్న విశ్వరూప్ .. ఆదివారం ఈ వ్యవహారంపై స్పందించారు. తానే పోటీ చేయనున్నట్లు తెలిపారు. పని తీరు ఆధారంగానే సీఎం జగన్ టికెట్ లు ఇస్తారని చెప్పిన విశ్వరూప్.. అమలాపురం నుండి పోటీ చేసేది తానేనని స్పష్టం చేశారు. 175 సీట్లు గెలవాలి అన్నదే సీఎం జగన్ లక్ష్యం అని, ఆ క్రమంలో ఎవరికైనా టికెట్ ఇవ్వడం సాధ్యంకాకపోతే ప్రత్యామ్నాయంగా వేరే పదవులు ఇస్తారని పేర్కొన్నారు. ఈ సారి కూడా టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు విశ్వరూప్. తండ్రీ తనయులు ఇద్దరూ టికెట్ తమదేనని ధీమా చెబుతుండటంతో క్యాడర్ లో గందరగోళానికి దారి తీస్తొంది.
శ్రీకాంత్ తీరు పట్ల విశ్వరూప్ సన్నిహితులు, ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశ్వరూర్ ను కాదని ఆయన తనయుడికి టికెట్ ఇస్తే తాము సహకరించమని పలువురు సీనియర్ లు చెబుతుండగా, వారి మాటలను శ్రీకాంత్ పట్టించుకోకుండా తండ్రికి వ్యతిరేకంగా ఉన్న నేతలను సైతం కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారుట. తండ్రీ తనయుల మధ్య నెలకొన్న ఈ టికెట్ వార్ కన్ఫ్యూజన్ తొలగిపోవాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిందే. పలు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ చార్జిల మార్పుల చేర్పులపై మంగళ, బుధవారాల్లో పార్టీ హైకమాండ్ నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో ఆ వివాదానికి తెరపడనుందని భావిస్తున్నారు.
TDP: టీడీపీ ఆశావహుల్లో కొత్త టెన్షన్ ..! ఇదెక్కడి సంస్కృతి అంటూ వాపోతున్న నేతలు..!!