Kesineni Sweta: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న తిరువూరు చంద్రబాబు సభకు అహ్వానించినా వెళ్లలేదు కేశినేని నాని. నానికి మద్దతుగా తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.
తాజాగా కేశినేని నాని కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పోరేటర్ కేశినేని స్వేత కూడా తండ్రి బాటలో పయనించడానికి సిద్దమైయ్యారు. ఇవేళ కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసి అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కేశినేని శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్ కార్పోరేటర్ గా ఉన్నారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్న క్రమంలో తన కుమార్తె శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
రాబోయే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానానికి వేరే వ్యక్తిని అభ్యర్ధిగా ఎంపిక చేస్తున్న క్రమంలో కేశినేని నాని కీలక నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన కార్యాలయం మీద పార్టీ జెండాలను పీకేసినట్లు కూడా ఆయనే స్వయంగా తెలిపారు. కేశినేని నానిని బుజ్జగించేందుకు చంద్రబాబు దూతగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మొన్న రాత్రి కేశినేని నానితో సమావేశమైనప్పటికీ ఆయన మెత్తబడలేదు. తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తిలేదని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
ఆదివారం కూడా తన రాజీనామాపై మరో సారి స్పష్టత ఇచ్చారు కేశినేని నాని. రాజీనామా చేస్తామని చెప్పిన తర్వాత కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పేశారు. రాజీనామా చేయడం ఖాయం, మళ్లీ విజయవాడ ఎంపిగానే పోటీ చేయడం ఖాయమని మరో సారి స్పష్టం చేశారు కేశినేని నాని. కేశినేని పార్టీ వీడటం ఖాయం అవ్వడం ఎన్టీఆర్ జిల్లాలో ఆయన వర్గీయులు ఇంకా ఎంత మంది రాజీనామా చేస్తారనేది వేచి చూడాలి.
YSRCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసిన సీ రామచంద్రయ్య