Municipal Elections : పురపాలక ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉండిపోగా పోలింగ్ సరళిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం 8గంటల నుండి 11 కార్పోరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిలకలూరిపేట మున్సిపాలిటీ, ఏలూరు కార్పోరేషన్ లో ఓట్ల లెక్కింపు చేయడం లేదు. ఫలితాల వెల్లడికి మరో 48 గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా అభ్యర్థులు, వారి అనుయాయులు మాత్రం పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్లు, ఓటింగ్ శాతం ఆధారంగా ఎవరికి ఎన్ని పడి ఉంటాయనే అంచనా వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పెరిగిన, తగ్గిన ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఓటింగ్ శాతం తగ్గడం వల్ల ఎవరికి నష్టం అంటూ లెక్కలు కడుతున్నారు.
మెజారీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందన్న అంచనా ఉన్నప్పటికీ జనసేన, బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాలలో చీలిక ఓట్ల ప్రభావం ఎవరిపై పడుతుంది అన్న దానిపైనా లెక్కలు కడుతున్నారు. మరో పక్క కొన్ని స్థానాల్లో జనసేన కీలకం అవుతుందని కూడా ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు జిల్లాలలో జనసేన మద్దతుదారులకు భారీగానే ఓట్లు వచ్చాయి. ఇవి సింబల్ ఎన్నికలు కావడంతో జనసేన, బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఈ ఫలితాలను వారు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో బీజేపీ – జనసేన, టీడీపీ మద్య ఎటువంటి అవగాహన ఒప్పందాలు లేకపోయినా పట్టణాల స్థాయిలో జనసేన, టీడీపీ నేతల మధ్య లోపాయికారీ ఒప్పందలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఏలూరులో అయితే టీడీపీ అభ్యర్థులు లేని వార్డుల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగంగా జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం కూడా చేశారు.
ఇదిలా ఉంటే పట్టణాల వారిగా ఫలితాలపై చర్చించుకుంటున్నారు. ప్రధానంగా విశాఖ, గుంటూరు, విజయవాడ నగర పాలక సంస్థలతో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీ లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై కాకి లెక్కలు వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా చేతులు ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ ఈ పురపాలక ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి ధీటుగానే ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కారణంగా అభ్యర్థుల గెలుపు ఓటములలో మెజారీలు స్వల్పంగానే ఉంటాయన్న మాట వినిపిస్తోంది. ఎవరి లెక్కలు, అంచనాలు ఎలా ఉన్నా ఫలితాల వెల్లడికి ఆదివారం వరకూ ఎదురుచూడాల్సిందే.