ఏపి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రోజు సాయంత్రం వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. డిప్యూటి స్పీకర్ కోనా రఘుపతి రాజీనామా చేయగా నిన్న స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆయన రాజీనామాను ఆమోదించారు. వైసీపీ తరపున డిప్యూటి స్పీకర్ పదవికి విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. వీరభద్రస్వామి ఈ రోజు సాయంత్రం 3.30గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం నాడు శాసనసభలో డిప్యూటి స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో వైసీపీకి ఉన్న సంఖ్యాబలం కారణంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. టీడీపీ నుండి తమ అభ్యర్ధిని బరిలో దించే అవకాశం లేదు.
కోనా రఘుపతి డిప్యూటి స్పీకర్ పదవికి ఎందుకు రాజీనామా చేశారనేది తెలియరాలేదు. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కోలగట్ల వీరభద్రస్వామి మంత్రిపదవిని ఆశించారు. విజయనగరం జిల్లా నుండి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను కొనసాగించాల్సి రావడంతో కోలగట్లకు అవకాశం లభించలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి కోలగట్లకు డిప్యూటి స్పీకర్ ఆఫర్ చేసినట్లు గా సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ ఆదేశాల మేరకు కోన రఘుపతి రాజీనామా చేశారనీ, ఆయన స్థానంలో కోలగట్లకు అవకాశం కల్పిస్తున్నారని పార్టీ లో జరుగుతున్న టాక్.