దేశ వ్యాప్తంగా సంచలనానికి తెరలేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి రంగంలోకి దిగింది. ఇప్పటికే ఒక పర్యాయం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ బృందాలు ఈ రోజు దేశ వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో 40 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తుండటం తీవ్ర కలకలాన్ని రేపింది. ఏపి తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఉదయం నుండి ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్ లోనే 25 ప్రాంతాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తుండటం తీవ్ర సంచలనం అవుతోంది. ఈ సారి ఏపిలోని నెల్లూరులోనూ ఓ లిక్కర్ వ్యాపారి నివాసాల్లో తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ రంగ ప్రవేశం చేసింది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు ఉన్న లింకులను కోర్టులో సమర్పిస్తామని బీజేపీ జిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలియజేసిన మరుసటి రోజే 25 ఈడీ బృందాలు హైదరాబాద్ కు వచ్చి సోదాలు నిర్వహించడం విశేషం. నిన్న సిర్సా, ఎఁపి సుధాంశు త్రివేది, బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అదేశ్ గుప్తాలతో మీడియాతో మాట్లాడుతూ గతంలో తాము చేసిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని కోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలు అన్నీ కోర్టుకే చెబుతామన్నారు.
లిక్కర్ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో హైదరాబాద్ నుండి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు..? ఎవరెవరిని కలిశారు..? ఢిల్లీ నుండి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని కలిసారు..? ఎప్పుడు కలిశారు ? అనే వాటి గురించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సిర్సా స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కుటుంభకోణం లో వచ్చిన డబ్బులను అమ్ ఆద్మీపార్టీ పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు అమిత్ ఆరోరా పై జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ లో మాట్లాడిన అన్ని విషయాలు బయటపడ్డాయనీ, ఇప్పటికైనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
రెండో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం .. కడప స్టీల్ ప్లాంట్ పై మాటల యుద్ధం