Velugonda Project: వెలుగొండ ప్రాజెక్టు అంశంపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసింది. కేంద్రం జారీ చేసిన గెజిట్ లో వెలుగొండ ప్రకటించలేదనీ, తక్షణమే వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో వెలుగొండ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రికి గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా కరువు కాటకాలు, ప్రజల ఇబ్బందులు, తాగు సాగునీటి సమస్యలను మంత్రి షెకావత్ కు వివరించిన టీడీపీ నేతల బృందం తక్షణం వెలుగొండ ప్రాజెక్టు కు అనుమతి కల్గిన ప్రాజెక్టుగా గెజిట్ లో చేర్చాలని కోరారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు తెలిపారు.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డా డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ రావు తదితరులు ఉన్నారు.
వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చే అంశంపై చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ నేతలు గతంలో విజ్ఞఫ్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మూడు పర్యాయాలు లేఖలు రాశారు. ఆ తరువాత ఏపి ముఖ్యమంత్రి చేతగానితనం, అసమర్థత కారణంగా వెలుగొండ ప్రాజెక్టుకు గెజిట్ లో చోటుదక్కలేదనీ, దీనిపై పదేపదే అభ్యంతరాలు తెలుపవద్దని కోరుతూ తెలంగాణ సీఎం కేసిఆర్ కూ వీరు లేఖరాశారు. చివరగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆపాయింట్మెంట్ తీసుకుని నేడు కలిసి వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు టీడీపీ నేతల బృందం.